బిల్కిస్ బానో కేసులో ఖైదీలకు క్షమాభిక్ష

 బిల్కిస్ బానో కేసులో ఖైదీలకు క్షమాభిక్ష

2002లో జరిగిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న నిందితులు11 మందిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 21, 2008న మంబయిలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు, బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ  దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పంచమహల్‌ కలెక్టర్‌ సుజల్‌ మయత్ర నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.  కాగా గత కొన్నినెలల క్రితం మిగతా వారందరినీ రిలీజ్ చేయాలని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా... ఈ 11మంది దోషులందరికీ క్షమాభిక్ష పథకం కింది రిలీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది 'కరసేవకులు' మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజుకున్న హింసలో.. ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో, చిన్నారి అయిన తన కూతురు, మరో 15 మందితో కలిసి తన గ్రామం నుండి పారిపోయింది. మార్చి 3న, వారు పొలంలో దాక్కుని ఉండగా,  కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన 30 మంది గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు సభ్యులు పారిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.