పసి పిల్లల తల్లులను జైలుకు పంపుతరా?

పసి పిల్లల తల్లులను జైలుకు పంపుతరా?

హైదరాబాద్, వెలుగు: పసి పిల్లల తల్లులపై హత్యాయత్నం కేసులు పెట్టి, జైలుకు పంపడం దారుణమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. పోడు భూముల విషయమై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఆగస్టు 3న జరిగిన పరిణామాలు తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫారెస్టోళ్లపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అభియోగాలపై నెలల వయసున్న పసి పిల్లల తల్లులను అరెస్ట్‌‌‌‌ చేసి జైలుకు పంపడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత నీచానికి దిగజారిపోయినయో స్పష్టం అవుతోందన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దళిత, గిరిజన వర్గాలకు చెందిన 23 మందిలో 20 మంది మహిళలే ఉన్నారన్నారు. వీరిపై ప్రభుత్వానికి ఏ స్థాయిలో చులకన భావం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించి బాధితులను రక్షణ కల్పించి, ఆదుకోవాలన్నారు.