రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు... వందేభారత్ రైల్లో సీటు కోసం రచ్చ..

రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు... వందేభారత్ రైల్లో సీటు కోసం రచ్చ..

రైల్లో ప్రయాణించేటప్పుడు బెర్తులు మార్చుకోవడం సాధారణమైన సీన్.. ముఖ్యంగా లోయర్ బెర్త్ కోసం తోటి ప్రయాణికులను రిక్వెస్ట్ చేసుకునేవారు ఎక్కువ. అలా సీటు ఎక్స్ చేంజ్ చేసుకోవడం అన్నది స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతుంటుంది రైళ్లలో. ఒక్కోసారి ఈ విషయమై ప్రయాణికుల మధ్య చిన్నపాటి గొడవ కూడా కామన్. కానీ.. ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్లే వందేభారత్ రైల్లో సీటు కోసం కొట్టుకునే రేంజ్ లో గొడవ జరిగింది. సీటు ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదని ప్రయాణికుడిని చావగొట్టారు బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

జూన్ 19న జరిగిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బాబిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. భార్య, కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్లే ప్రయాణిస్తుండగా సీటు సర్దుబాటు చేసుకోవాలని తోటి ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ ను రిక్వెస్ట్ చేశారు. రాజ్ ప్రకాష్ సీటు సర్దుబాటుకు ఒప్పుకోకపోగా.. తనను దూషించాడని ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తెలిపారు. రైలు ఝాన్సీ స్టేషన్ చేరుకోగానే తన కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించాడని.. ఇది గొడవకు దారి తీసిందని తెలిపారు రాజీవ్.

అయితే బాధితుడు మాత్రం.. తాను సీటు ఇచ్చేందుకు నిరాకరించానన్న కోపంతో ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించాడని.. ఎమ్మెల్యే కుటుంబం పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రాజీవ్ సింగ్. ఎమ్మెల్యే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. రైల్లో సామాన్యుల భద్రతపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.