సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటే., మిగతా చోట్ల…

సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటే., మిగతా చోట్ల…

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ బండి సంజ‌య్

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ . మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి ప‌డింద‌ని.. ఇలా నాణ్యత లేని ప్రోజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయోనని అనుమానం వ్యక్తం చేశారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండపోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యమన్నారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణని ఆరోపించారు. నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నుంచి ఈ మొత్తాన్ని రికవర్ చేసి తక్షణమే మరమత్తు పనులు చేపట్టాలన్నారు. నాణ్యత లేని పనులు చేపడుతుంటే విజిలెన్సు డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తున్నట్లు? అని సంజ‌య్ ప్ర‌శ్నించారు. ప్రాజెక్టుల పేరు మీద నాణ్యత లేని పనులు చేపట్టి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందన్నారు.