V6 News

తమిళనాడులో 84.41 శాతం.. బెంగాల్లో 91.46 శాతం పోలింగ్.. 1947 నుంచి ఇంత ఓటింగ్ ఎప్పుడూ జరగలే !

 తమిళనాడులో 84.41 శాతం.. బెంగాల్లో 91.46 శాతం పోలింగ్.. 1947 నుంచి ఇంత ఓటింగ్ ఎప్పుడూ జరగలే !

చెన్నై/కోల్కత్తా: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రికార్డ్ శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 84.41 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల్లో 91.46 శాతం పోలింగ్ నమోదైంది. 1947 నుంచి ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ తొలి దశలో 152 నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. 

అప్పటికి క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతించారు. పోలింగ్ శాతం ఈ స్థాయిలో పెరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఒక్క ఓటరుకు ఆయన శాల్యూట్ చేశారు.

ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో మలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 4న కేరళ, అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తుంది.