Alia Bhatt: బ్రాండ్ వాల్యూలో ఆలియా భట్ టాప్.. వెనకపడ్డ దీపికా, రష్మిక మందన్న

Alia Bhatt: బ్రాండ్ వాల్యూలో ఆలియా భట్ టాప్..  వెనకపడ్డ దీపికా, రష్మిక మందన్న

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) మరో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ 'క్రోల్' (Kroll) రిలీజ్ చేసిన 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2025' ప్రకారం, ఆలియా భట్ భారతదేశంలో అత్యంత విలువైన మహిళా సెలబ్రిటీ బ్రాండ్‌గా అగ్రస్థానంలో నిలిచారు. ఈ నివేదిక ప్రకారం ఆలియా భట్ బ్రాండ్ విలువ రూ.892 కోట్లు ($93.9 మిలియన్లు)గా నమోదైంది. ఓవరాల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ జాబితాలో ఆమె 6వ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, తన భర్త రణబీర్ కపూర్ సహా పలువురు ప్రముఖ హీరోలను సైతం వెనక్కి నెట్టి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా లేడీ స్టార్స్ దీపికా పడుకోనే, రష్మిక మందన్నతో పాటు పలువురు బడా హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి సత్తా చాటింది. 
 
స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన ఆలియా..

ఆలియా భట్ తన బ్రాండ్ విలువతో పలువురు బడా హీరోలను సైతం బీట్ చేసింది. ఆమె భర్త, నటుడు రణబీర్ కపూర్ రూ.761 కోట్ల బ్రాండ్ విలువతో 10వ స్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో ఆలియా భట్‌తో పాటు దీపికా పడుకోన్ (రూ.849.35 కోట్లు) మాత్రమే చోటు దక్కించుకున్న మహిళా సెలబ్రిటీగా నిలిచారు. అలాగే , రష్మిక మందన్న రూ.715.91 కోట్ల బ్రాండ్ విలువతో 12వ స్థానంలో నిలిచింది. అయితే, ఈ నివేదికలో షారుఖ్ ఖాన్ నెం.1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు.

ఆలియా సక్సెస్కు కారణాలు..

బలమైన ఎండార్స్‌మెంట్‌లు: జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆలియా తన మార్కెట్ డిమాండ్‌ను కొనసాగిస్తున్నారు.

గ్లోబల్ గుర్తింపు: అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్లు, గ్లోబల్ బ్రాండ్లతో అనుబంధం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు.

బిజినెస్ రంగంలో దూకుడు: నటిగానే కాకుండా 'ఎడ్-ఎ-మమ్మా' (Ed-a-Mamma) వంటి సొంత వ్యాపారాలతో ఆలియా తన బ్రాండ్ విలువను మరింత పెంచుకున్నారు. మరిన్ని బిజినెస్ లు సైతం విస్తరించుకుంటూ వెళ్తుంది.

సోషల్ మీడియా ప్రభావం: ఇన్‌స్టాగ్రామ్‌లో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆలియా భట్, హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్ వంటి నటులను సైతం వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత ప్రభావవంతమైన నటిగా నిలిచారు. 

ఇతర హీరోయిన్ల స్థానాలు:

రష్మిక మందన్న: రూ. 715.91 కోట్లతో 12వ స్థానం.

కరీనా కపూర్: రూ. 588.29 కోట్లతో 15వ స్థానం.

కియారా అద్వానీ: రూ. 493.64 కోట్లతో 17వ స్థానం.

కృతి సనన్: రూ. 481.42 కోట్లతో 18వ స్థానం.

అనన్య పాండే: రూ. 461.13 కోట్లతో 19వ స్థానం.

జాన్వీ కపూర్: 23వ స్థానం.

సత్తా చాటిన బాద్‌షా..

క్రోల్ (Kroll) విడుదల చేసిన 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2025' ప్రకారం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచారు. షారుఖ్ ఖాన్ $177.9 మిలియన్ల (సుమారు ₹1,691 కోట్లు) బ్రాండ్ విలువతో భారతదేశంలోనే అత్యంత విలువైన నంబర్ 1 సెలబ్రిటీ బ్రాండ్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2025లో సినిమాలు విడుదల కాకపోయినా, ఆయన ఎండార్స్‌మెంట్ బ్రాండ్ల సంఖ్య 28 నుంచి 36కి పెరగడం, భారీ ప్రకటనల డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఆయన బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అంతేకాకుండా, 2023లో విడుదలైన 'పఠాన్', 'జవాన్', 'డంకీ' చిత్రాల విజయాలు కూడా షారుఖ్ ఖాన్ మార్కెట్ స్టామినాను మరింత బలోపేతం చేశాయి.గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోగా, రణవీర్ సింగ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.