భీమిలి: విశాఖ భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో షాకింగ్ ఘటన జరిగింది. కృష్ణాపురం కేజీబీవీలో రాత్రి సమయంలో నిద్రిస్తున్న బాలికల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏకంగా పదిమంది తొమ్మిదో తరగతి బాలికల జడలు కత్తిరించడం కలకలం రేపింది. ఈ విషయం బయటకు రావడంతో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే ఘటనపై ఆరా తీసేందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేజీబీవీని సందర్శించారు.
బాలికల జడలు కత్తిరించిన ఘటనపై ప్రిన్సిపాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విద్యార్థినులు ఉన్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు. బాలికల భద్రతకు సంబంధించిన పర్యవేక్షణలో ఏమైనా లోపాలు జరిగాయేమోనని ఆరా తీశారు.
ఈ ఘటన ఎవరైనా తోటి బాలికలే ఆట పట్టించేందుకు చేశారో లేక ఎవరైనా బయటి వ్యక్తులు చేశారోననే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన మిస్టరీగా మారింది. అధికారుల విచారణలో త్వరలోనే అసలు నిజం ఏంటనేది తెలుస్తుంది
