పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో హార్ట్ సర్జరీ.. ఎంపీ గంభీర్ మానవత్వం

పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో హార్ట్ సర్జరీ.. ఎంపీ గంభీర్ మానవత్వం

భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ చొరవతో ఓ పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో హార్ట్ సర్జరీ జరగబోతోంది. పాకిస్థాన్ కు చెందిన చిన్నారి ఒమైమా ఆలీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు ఎంపీ గౌతమ్ గంభీర్ దృష్టికి వచ్చింది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఇండియాకు తరలించే ప్రయత్నంలో వీసా అనుమతి కావాల్సి ఉండటంతో.. గంభీర్ చొరవ తీసుకున్నారు.

పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో వైద్యం కోసం పాస్ పోర్ట్ ఇష్యూ చేయాలని విన్నవిస్తూ…. అక్టోబర్ 1వ తేదీన భారత విదేశాంగ శాఖకు లెటర్ ద్వారా తెలిపారు. దీనిపై అక్టోబర్ 9వ తేదీన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నుంచి గంభీర్ రిప్లై అందుకున్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ఆ చిన్నారికి అవసరమైన వీసా ఏర్పాట్లు చేస్తుందంటూ జయశంకర్ ఆ లెటర్ లో తెలిపారు. తాజాగా… పాకిస్థానీ చిన్నారి ఒమైమా ఆలీ, ఆమె తల్లిదండ్రులకు భారత వీసా అందింది.

ఇండియాలో వైద్య సహాయం తీసుకునేందుకు పాకిస్థానీ చిన్నారికి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో స్పందించారు గంభీర్. ఇండియాపై ద్వేషం చూపించే పాకిస్థాన్ ప్రభుత్వం, ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ఐఎస్ఐ లకే తాను వ్యతిరేకమనీ.. అంతేకానీ పాకిస్థానీ ప్రజలపై కాదని గంభీర్ చెప్పారు. ఓ పాకిస్థానీ చిన్నారి భారత్ లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే కావాల్సిందేముంటుందని చెప్పారు బీజేపీ ఎంపీ.