ఆ ముగ్గురు రాజకీయ జాతిరత్నాలు

ఆ ముగ్గురు రాజకీయ జాతిరత్నాలు
  • పైసలు కేంద్రానివి.. ఆర్భాటాలు టీఆర్ఎస్ వాళ్ళవి
  • మూడు బార్లు.. ఆరు వైన్సులు పెట్టె ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవాలి
  • వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి కామెంట్స్


వరంగల్ అర్బన్:  బండి సంజయ్ ప్రచారంతో వరంగల్‌లో వార్ వన్ సైడ్‌గా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే వరంగల్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఇదే విషయాన్నిబీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఆయన బీజేపీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. పైసా పే పై చర్చకు బీజేపీ సవాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అభివృద్ది గురించి చర్చకు రావాలి. పైసలు కేంద్రానివి.. ఆర్భాటాలు టీఆర్ఎస్ వాళ్ళవి. టీఆర్ఎస్ పార్టీ వచ్చింది.. ఓరుగల్లుకు వరదలు వచ్చాయి. కాకతీయుల పాలన తీసుకొద్దామని బీజేపీ చూస్తే.. టీఆర్ఎస్ కబ్జాల పాలన తీసుకొచ్చింది. కబ్జాల బాధితుల లిస్ట్ తీస్తే జేఎన్ఎస్ గ్రౌండ్ కూడా సరిపోదు. వరంగల్లు అభ్యర్థులు టీఆర్ఎస్ నాయకులకి బినామీలు. వినయ్ భాస్కర్, నరేందర్, మంత్రి దయాకర్.. ఆ ముగ్గురూ జాతిరత్నాలే. బీజేపీ ఓరుగల్లుని స్మార్ట్ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ మాత్రం ఓరుగల్లుని స్లమ్ సిటీగా మార్చాలని చూస్తోంది. సాయిబాబా ఆలయంలో పూజారిని హత్య చేస్తే.. టీఆర్ఎస్ వాళ్లు ఎవరు స్పందించ లేదు. మూడు బార్లు.. ఆరు వైన్సులు పెట్టె ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవాలి. కాకతీయ పాలన బీజేపితోనే సాధ్యం. కాకతీయ గడ్డమీద కషాయ జెండా ఎగరవేయబోతున్నాం’ అని ఆయన అన్నారు.