ఆర్సీబీపై కేసు: తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వం సీరియస్

ఆర్సీబీపై కేసు: తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వం సీరియస్
  • స్టేట్​ క్రికెట్ అసోసియేషన్​పైనా చర్యలు
  • ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకోని ఆర్సీబీ, కేఎస్​సీఏ
  • మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు
  • తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్నాటక హైకోర్టు నోటీసులు
  • వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్
  • బెంగళూరు సీపీని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం
  • ఆర్సీబీ, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్ట్​కు ఆదేశాలు

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్​మెంట్, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ), ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సంస్థ డీఎన్ఏ ఎంటర్​టైన్​మెంట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్స్‌‌‌‌‌‌‌‌పై కబ్బన్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్​ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్​మెంట్, కేఎస్​సీఏ మొండిగా వ్యవహరించినట్లు పోలీసులు వివరించారు. 

భద్రతా కారణాలతో పరేడ్‌ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోలేదని ఆరోపించారు. ఆర్సీబీ సభ్యులను సన్మానించాలనుకుంటే ఆదివారం ఓ చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. బుధవారం విజయోత్సవాలు వద్దని మంగళవారం రాత్రి నుంచే రిక్వెస్ట్ చేసినట్లు వివరించారు. అభిమానులు జోష్​లో ఉన్నారని, కొద్దిగా కూల్ అయ్యాక కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పినట్లు తెలిపారు. 

ఎలాంటి ర్యాలీ నిర్వహించొద్దని.. ఒకే ప్రాంతానికే పరిమితమై వేడుక చేపట్టాలని కండీషన్ పెట్టినా.. దాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ఆర్సీబీ మేనేజ్​మెంట్, కేఎస్ సీఏ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందన్నారు. క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వివరించారు. స్టేడియంలో ఎంట్రీకి ఫ్రీ పాస్​లు ఇస్తామని ఆర్సీబీ మేనేజ్​మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని, దీంతో లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారని చెప్పారు.

సీఐడీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు

తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును క్రిమినల్‌ సీఐడీకి అప్పగిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోర్టుకు ఇచ్చిన స్టేటస్‌ రిపోర్టులో ఈ విషయాన్ని ప్రభుత్వం పేర్కొన్నది. సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుందని తెలిపింది. తదుపరి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతో పాటు ఎఫ్‌ఐఆర్‌ కాపీని సీఐడీకి అప్పగించినట్లు సమాచారం. 

కాగా, విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మేజిస్ట్రేట్‌ జి.జగదీషా, కేఎస్‌సీఏ, ఆర్సీబీలకు నోటీసులు పంపనున్నారు. గురువారం ఆయన చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీతో పాటు స్టేడియం గేట్లు, గోడలను పరిశీలించారు. రిపోర్టును 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తానని జగదీషా మీడియాకు తెలిపారు.

బాధ్యుల అరెస్ట్​కు సీఎం ఆదేశాలు

బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి.దయానందతో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కేబినెట్ భేటీ తర్వాత గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఈ ఘటనకు బాధ్యులైన బెంగళూరు సీపీ దయానంద, అడిషనల్ సీపీ (వెస్ట్) వికాస్ కుమార్, డీసీపీ (సెంట్రల్) శేఖర్ హెచ్.టెక్కన్నవర్, ఏసీపీ (కబ్బన్ పార్క్) బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ గిరీశ్​ను సస్పెండ్ చేశాం. 

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి మైఖేల్ డి.కున్హా నేతృత్వంలో వన్ మెన్ కమిషన్‌ ఏర్పాటు చేశాం. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించాను. ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ, కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీలకు చెప్పిన. కేబినెట్‌ భేటీలో తొక్కిసలాట ఘటనపై చర్చించినం’’అని సిద్ధరామయ్య తెలిపారు. 

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టిన ఆర్సీబీ

ఆర్బీసీ మేనేజ్​మెంట్ పోలీసుల రిక్వెస్ట్ ను పట్టించుకోలేదు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఉదయం ఆర్సీబీ తన అధికారిక ఖాతాలో విజయోత్సవ ర్యాలీ గురించి పోస్టు పెట్టింది. మధ్యాహ్నం 3.14 వరకు దానిపై అప్‌డేట్లు ఇచ్చింది. అందరూ రోడ్‌షోను ఎంజాయ్ చేయాలని చెప్పింది. చిన్న స్వామి స్డేడియంలో ఎంట్రీకి ఫ్రీ పాస్​లు ఇస్తామని ప్రకటించింది. ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ అని చెప్పడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. రోడ్​షోలోనూ బస్సుల వెంట అభిమానులు పరుగులు పెట్టారు. ఆర్సీబీ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై కూడా అటు పోలీసులు, ఇటు హైకోర్టు విచారిస్తున్నది. 

తొక్కిసలాట ఘటనపై నిజాలు తేలాలి: హైకోర్టు

తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కోర్టు.. గురువారం విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్‌ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. తొక్కిసలాట ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది. 

క్రికెటర్లకు సన్మానం చేయాలని నిర్ణయించింది ఎవరు? సన్మానం​ చేయాలనుకుంది ఆర్సీబీనా? కర్నాటక క్రికెట్ అసోసియేషనా? లేక ప్రభుత్వమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా, ఆర్సీబీ మేనేజ్​మెంట్, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్ సీఏ), డీఎన్​ఏ ఎంటర్​టైన్​మెంట్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇలా జరుగుతుందని ఊహించలేదు: ఏజీ

తొక్కిసలాట ఘటనలో వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ప్రభుత్వానికి కర్నాటక హైకోర్టు హెచ్చరించింది. ఇంతటి భారీస్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించింది. స్టేడియంలో 21 గేట్లు తెరిచారా? అంటూ నిలదీసింది. అడ్వకేట్ జనరల్(ఏజీ) స్పందిస్తూ.. రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలు తీసుకున్నామని.. కానీ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగిందని తెలిపారు. వాటర్‌ ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వెహికల్స్​ రెడీగా ఉంచామని తెలిపారు. ఈ స్టేడియం సామర్థ్యం 35 వేలు అయితే, సాధారణ సమయాల్లో 30 వేల టికెట్లు మాత్రమే ఇస్తారని వివరించారు. 

కానీ, కార్యక్రమానికి దాదాపు 2.5 లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారన్నారు. మధ్యాహ్నం నుంచే రద్దీ మొదలవ్వగా.. సాయంత్రానికి కిక్కిరిసిపోయి పరిస్థితి చేయిదాటిపోయిందని తెలిపారు. ఘటన సమయంలో స్టేడియం పరిసరాల్లో 1,000 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నట్లు వివరించారు. అయితే, అంతకుముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీ ఈవెంట్‌కు 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం. వాదనలు విన్న కోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

చనిపోయింది వీళ్లే..

తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. మృతులంతా 40 ఏండ్లలోపు వారే. చనిపోయిన వాళ్లలో ఏపీకి చెందిన 14 ఏండ్ల బాలిక దివ్యాన్షి ఉన్నది. దోరేశ్ (32), భూమిక (20), సహానా (25), అక్షత (27), మనోజ్​కుమార్ (33), శ్రవణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20) తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గేట్ నంబర్ 7వద్ద జరిగిన ఘటనలో చనిపోయారు.

ప్రభుత్వం ఏమంటున్నది?

ఆర్సీబీ, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని, దానికి తగ్గట్టుగానే అనుమతులు ఇచ్చామని హోం మంత్రి జి.పరమేశ్వర వెల్లడించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ఉంటుందని ఇప్పటికే సీఎం చెప్పారన్నారు. గురువారం ఆయన తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రామ్​కు, ఆర్సీబీ, క్రికెట్ అసోసియేషన్ సన్మాన సభకు సంబంధం లేదు. 

సభ్యులను సన్మానించాలని మేము వాళ్లను కోరలేదు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చాక ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ రూపొంది స్తాం. పోలీస్ శాఖ గైడ్​లైన్స్ ప్రకారం ఇకపై పెద్ద ఈవెంట్‌లను నిర్వహించేలా సూచనలు జారీ చేస్తాం’’అని ఆయన తెలిపారు.