ఫోన్ ట్యాపింగ్‌‌పై కేంద్రమే సీబీఐ విచారణకు ఆదేశిస్తది : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఫోన్ ట్యాపింగ్‌‌పై కేంద్రమే సీబీఐ విచారణకు ఆదేశిస్తది : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  • కేంద్ర సంస్థ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటకు వస్తరు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతిపై సమయం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతోనే అసలు దోషులు బయటికి వస్తారన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అక్రమాలు, అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అనేకమంది రాజకీయ నాయకులు, జడ్జిలు, సినీ నటుల ఫోన్లను బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసిందన్నారు. 

అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేస్తుందే కానీ, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సరైన సమాచారం రాబట్టలేక పోతున్నాయని, వాస్తవాలు నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’పై ప్రచారం చేస్తోందని, కానీ ఆ రైజింగ్ కరప్షన్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఉందని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు ప్రతిపాదనలు ముందే పంపి ఉంటే ఆమోదం వచ్చేదని వెల్లడించారు.