- 76 వేల కోట్ల ఇన్సెంటివ్స్
- పీఎల్ఐ పథకం కింద కంపెనీలకు కేటాయింపు
- 12 యూనిట్ల ఏర్పాటే టార్గెట్!
- త్వరలో సెమీకండక్టర్ పాలసీ
- వచ్చే వారం నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
న్యూఢిల్లీ: ఇండియాను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్రం ప్రయత్నాలను షురూ చేసింది. వచ్చే ఆరేళ్లలో 20కి పైగా సెమీకండక్టర్ డిజైన్, కాంపోనెంట్స్ తయారీ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) యూనిట్లను ఏర్పాటు చేయించడానికి రంగంలోకి దిగింది. వీటిని నిర్మించబోయే కంపెనీలకు రూ.76 వేల కోట్ల విలువైన ఇన్సెంటివ్లను అందించాలని భావిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాల ద్వారా భారతదేశంలో చిప్ల తయారీని, ఎగుమతులను పెంచడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్రం సెమీకండక్టర్ విధానం తీసుకొచ్చిందని, ఫలితంగా మనదేశం మాన్యుఫాక్చరింగ్ బేస్గా మారుతుందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లేల కోసం రెండు ఫ్యాబ్ యూనిట్లను, డిజైనింగ్, కాంపోనెంట్ల కోసం 10 యూనిట్లను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఆటోమొబైల్స్, హ్యాండ్సెట్ల వంటి ఎలక్ట్రానిక్ పలు ప్రొడక్టులను తయారు చేయడానికి సెమీకండక్టర్లను ఉపయోగిస్తారు. చిప్ల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేయడానికి తయారు చేసిన ప్రపోజల్ వచ్చే వారం జరిగే క్యాబినెట్ సమావేశంలో పరిశీలనకు వస్తుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) గ్రాన్యులర్ వివరాలను రూపొందించి, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ‘‘కేబినెట్ ఆమోదం వచ్చాక సెమీకండక్టర్ పాలసీని ఖరారు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ల కోసం కంపెనీల నుండి ఆసక్తిని కోరుతూ ప్రచారం చేస్తారు" అని మరొక అధికారి తెలిపారు.
చిప్ కంపెనీలు వస్తే ఎంతో మేలు...
"ప్రపంచం అంతటా దాదాపు అన్ని దేశాల్లోని ఇండస్ట్రీలకు సెమీకండక్టర్ల కొరత ఉంది. దీనివల్ల ప్రొడక్షన్కు ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ప్రొడక్షన్ను కొంతకాలం నిలిపివేశాయి. కార్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఇయర్బడ్లు, వాషింగ్ మెషీన్ల వరకు.. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో - సెమీకండక్టర్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర సరైన సమయంలో సెమీకండక్టర్ పాలసీని తీసుకొస్తోంది" అని గార్ట్నర్ చీఫ్ రీసెర్చర్ కనిష్క చౌహాన్ అన్నారు. "కేంద్ర ప్రభుత్వ పాలసీ.. ఫౌండ్రీలను (ఫ్యాబ్రికేషన్ యూనిట్లను) మన దేశానికి రప్పించగలిగితే ఎంతో మేలు జరుగుతుంది. ఈ చిప్స్ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని వివరించారు. శామ్సంగ్, ఎన్ఎక్స్పీ, క్వాల్కామ్ వంటి చిప్ మేకర్ల అవసరాలకు అనుగుణంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎంఎస్సీ) వంటి కంపెనీలతో సాయంతో వేఫర్లను డిజైన్ చేశారు. దీనివల్ల షియోమి, సిస్కో వంటి కంపెనీలు చిప్లను పరీక్షించి అమ్ముతాయి. వీటిని తయారు కూడా చేయగలుగుతాయి. సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్ల ఏర్పాటు కోసం ఆసక్తిని, అవసరాలను తెలియజేయాలని కంపెనీలను ఆహ్వానించిన దాదాపు ఒక ఏడాది తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ల ఫౌండ్రీ ఏర్పాటుకు 40 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇస్తామని గతంలో ప్రకటించినా, కంపెనీలు అప్పుడు ముందుకు రాలేదు.