తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండడంతో..ఏప్రిల్ 15వ తేదీన ఈసీ బృందం హైదరాబాద్లో పర్యటించింది.  డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ నేతృత్వంలోని ఈసీ బృందం....  తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌, ఇతర అధికారులతో సమావేశమైంది. ఎన్నికల కసరత్తుపై  రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది. 

రాష్ట్రంలో  ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై ఈసీ బృందం సమీక్షించింది.  లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండాలని అధికారులను ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. జూన్‌ 1 నుంచి EVMల మొదటి దశ తనిఖీ చేపట్టాలని అధికారులు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తామని పేర్కొంది. EVM లను పరీక్షించి అన్ని జిల్లాలకు పంపామని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. అధికారులకు శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని సూచించింది.  పోలింగ్‌ శాతం పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల బృందం ఆదేశించింది. 

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.  తన పదవీ కాలం పూర్తయ్యే 9 నెలల ముందు ( సెప్టెంబరు 6 2018న) సీఎం కేసీఆర్‌ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో సాధారణ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.