యువకుడి కండ్లల్లో కారం కొట్టి చైన్ స్నాచింగ్

యువకుడి కండ్లల్లో కారం కొట్టి చైన్ స్నాచింగ్

ఎల్​బీ నగర్, వెలుగు: హైదరాబాద్​లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు మహిళల మెడలోంచి చైన్లు కొట్టేస్తున్న స్నాచర్లు.. మగవాళ్ల మెడలోని చైన్లను కూడా వదలట్లేదు. పాలు తీసుకుని వస్తున్న ఓ కిరాణా దుకాణం యజమాని కంట్లో కారం కొట్టి అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బుధవారం వనస్థలిపురం సాహెబ్​నగర్​లో ఈ ఘటన జరిగింది. పద్మావతి కాలనీకి చెందిన బండారి గోవర్ధన్(30) స్థానికంగా శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఉదయం 6 గంటలకు పాలు తీసుకొని వీరాంజనేయ కాలనీ నుంచి దుకాణానికి తిరిగివస్తున్నాడు. బైక్ మీద ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు.. గోవర్ధన్ కండ్లలో కారం చల్లి అతడి మెడలోని 2 తులాల  బంగారు గొలుసును లాక్కొని పరా రయ్యారు.

గోవర్ధన్ వాళ్లను వెంబడించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకరు బైక్​మీద సామనగర్ వైపు, మరొకరు వీరాంజనేయ కాలనీ వైపు పరిగెత్తారని బాధితుడు వెల్లడించాడు. వనస్థలిపురం పోలీసులు స్పాట్​కు వచ్చి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మగవాళ్ల నుంచి కూడా చైన్లు కొట్టేసే స్థాయికి కేటుగాళ్లు తెగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.