
ఓయూ, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని, అవినీతికి పాల్పడే అధికారులకు అండదండలు అందించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అవినీతి వెనుక కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ లు ఉన్నారని దయాకర్ ఆరోపించారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాలకృష్ణ లాంటి అవినీతి తిమింగలాలు మరి కొంత మంది ఉన్నారని, వాళ్లు కూడా జైళ్లకు వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు. డైరెక్టర్ రూ. 500 కోట్లు సంపాదిస్తే , ఆ పోస్ట్ ఇచ్చిన కేటీఆర్ ఎంత సంపాదించారనేది సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు. అవినీతి పరులపై విచారణ జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు మేడ శ్రీను, సుమన్ గౌడ్, స్వాతి , సైదులు, మహేంద్ర, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.