రాజన్న సిరిసిల్ల, వెలుగు: బిర్లా ఎ1 సిమెంట్ కంపెనీ పేరుతో టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేసి రూ.2.60 లక్షలు కొట్టేసిన బిహార్కు చెందిన యువకుడిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఆ వివరాలు తెలియజేశారు. బిహార్ కు చెందిన కుందన్ కుమార్(25) సిమెంట్ కంపెనీల పేరుతో తప్పుడు వివరాలు, టోల్ ఫ్రీ నంబర్లు క్రియేట్ చేసి ఇంటర్నెట్లో పెట్టాడు.
బిర్లా కంపెనీ పేరుతో ఆన్లైన్లో టోల్ ఫ్రీ నంబర్1800 419 2877 క్రియేట్ చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన ఉత్తం అంజయ్య సిమెంట్ అవసరముండి ఈ నెల 9న ఆన్లైన్లో వెతికి సదరు టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేశాడు. 640 బస్తాల సిమెంట్ కావాలని అడగడంతో రూ.1,69,600 చెల్లించాలని కుందన్ కోరాడు. నిజమేనని నమ్మిన అంజయ్య అతడి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశాడు. మరుసటి రోజు కుందన్.. అంజయ్యకు ఫోన్ చేసి వెయ్యి బస్తాలకు డబ్బులు చెల్లిస్తేనే సిమెంట్ పంపిస్తానని చెప్పడంతో మరో 340 బస్తాల కోసం రూ.95,400 డిపాజిట్ చేశాడు. మరోసారి రూ.11వేలు పంపించాలని చెప్పడంతో అంజయ్యతాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
సీఐ మొగిలి ఆధ్వర్యంలో సైబర్ సెల్ ఎస్ఐ శ్రీకాంత్ తన టీంతో ఎంక్వైరీ చేసి కుందన్కుమార్ను నిందితుడిగా గుర్తించారు. అతడు బిహార్ నుంచి మోసాలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ నెల10న రాత్రి ఎస్ఐ టీంతో నిందితుడు ఉండే బిహార్లోని నలంద జిల్లా చమర్ వెళ్లారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు. నిందితుడి నుంచి రూ.2.60 లక్షల నగదు, ఆరు సిమ్ కార్డులు, పాస్బుక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.