ముంబై: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేయలేకపోతున్న చెన్నై సూపర్కింగ్స్... ఐపీఎల్–15లో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో కోల్కతా చేతిలో ఓడిన సీఎస్కే.. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్లో బౌలింగ్ ఫెయిల్యూర్స్తో భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్లో మరింత మెరుగైన పెర్ఫామెన్స్ చేయాలని చెన్నై లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా స్ట్రాటజీలు కూడా టీమ్కు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. పేసర్లు దీపక్ చహర్, ఆడమ్ మిల్నే, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్ లేకపోవడం చెన్నైకి ప్రతికూలంగా మారింది. కొత్త కుర్రాళ్లు తుషార్ దేశ్పాండే, ముకేశ్ చౌదరీ గాడిలో పడాల్సిన అవసరం చాలా ఉంది. బ్యాటింగ్లో ఊతప్ప, మొయిన్ అలీ రాణిస్తున్నా.. రుతురాజ్ ఫామ్లోకి రావాలి. దూబే హార్డ్ హిట్టింగ్ టీమ్కు అదనపు బలంగా మారింది. మిడిల్ ఓవర్స్లో ధోనీ, జడేజా, బ్రావో బ్యాట్ఝుళిపించాల్సిందే. మరోవైపు పంజాబ్లో భారీ హిట్టర్లకు కొదువలేదు. మయాంక్ అగర్వాల్, ధవన్, రాజపక్స, ఒడియాన్ స్మిత్, షారూక్ ఖాన్ బ్యాటింగ్ పవర్ను చూపిస్తే పంజాబ్కు తిరుగుండదు. బౌలింగ్లో రబాడ రావడం సానుకూలాంశం. రాహుల్ చహర్, హర్ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు.

