వరంగల్ అర్బన్ : సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తన జిల్లాలో పసుపు బోర్డు హామీ నెరవేర్చని అరవింద్.. వరంగల్ వచ్చి కేసీఆర్ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. తమ పార్టీ నాయకులపై విమర్శలు చేసే అర్హత అరవింద్ కు లేదని అన్నారు. అరవింద్ వి అసత్యపు మాటలని, వారు అభివృద్ధి చేయరు… మరొకరిని చేయనివ్వరని అన్నారు. ఖబడ్దార్ బీజేపీ నాయకుల్లారా.. మాజోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. అరవింద్ రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 అరవింద్ అని అన్నారు. రాజస్థాన్ యూనివర్సిటీలో తప్పుడు ధృవపత్రాలు తెచ్చి ఎంబీఏ పాస్ అయ్యానని చెప్పాడని, అతనివి సిఖండి మాటలని అన్నారు. వరంగల్ లో తాను భూమి కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నాడని.. అది నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించే దమ్ముందా అని అరవింద్ ను ప్రశ్నించారు.