
సీఎం కేసీఆర్ గత 12 రోజులుగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. జూన్ 28న మాజీ ప్రధాని పీవీ జయంతి వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ప్రగతిభవన్ కు రాలేదు. కీలకమైన అంశాలపై మాట్లాడేందుకు సీఎస్, డీజీపీ, నిఘా ఆఫీసర్లను ఫాంహౌజ్ కు పిలిచి రివ్యూ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాంహౌజ్ లో ఓ హాల్ ను ఏర్పాటు చేసినట్టు సమాచారం.
సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేతకు ముందు రోజు సీఎస్, డీజీపీ దాదాపు పది గంటల పాటు సీఎంతో ఫాంహౌజ్ లో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నట్టు తెలిసింది. అత్యవసరమైన ఫైల్స్ పై సంతకం కోసం ఆఫీసర్లు ఫాం హౌజ్ కే వెళ్తున్నారు. మిగతా ఫైళ్లను చూడటం లేదని అధికారులు అంటున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ వందలాది ఫైళ్లు సీఎం ఆఫీసులోనే ఆగిపోయాయని వారిలో చర్చ నడుస్తోంది.