క‌ల్న‌ల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి.. సాయం అందించిన సీఎం కేసీఆర్

క‌ల్న‌ల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి.. సాయం అందించిన సీఎం కేసీఆర్

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మ‌ర‌ణం పొందిన‌ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కల్నల్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. కల్నల్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం అపాయింట్‌మెంట్ లెట‌ర్‌ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ఇచ్చారు.