కాళోజీ సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్

కాళోజీ సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్

ప్రజా సంక్షేమం కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ  సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి  కేసీఆర్ తెలిపారు. పద్మవిభూషణ్ కాళోజీ  నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన  కృషిని గౌరవిస్తూ, కాళోజీ జయంతిని   “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు.

తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, వైతాళికులను గుర్తించి, కాళోజీ నారాయణ రావు’ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాదికిగాను కాళోజీ పురస్కారాన్ని అందుకున్న కవి, చరిత్రకారుడు శ్రీ రామోజు హరగోపాల్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ‘పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది’..అనే కాళోజీ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర, ప్రగతి నమూనాను దేశవ్యాప్తం చేసేందుకు ముందడుగు వేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.