అక్రమార్కులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరు చెప్పి సెటిల్ మెంట్లు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తన పేరు వాడుకుని ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. పంచాయతీలు, సెటిల్ మెంట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు సైతం పైరవీకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. ప్రజలకు సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తానని.. కానీ అక్రమాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఎవరైనా తన పేరు చెప్పి వేధింపులకు గురిచేస్తే.. భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే, కరీంనగర్లోని తన ఎంపీ కార్యాలయ సిబ్బంది దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకురావాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
