ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలకు చెక్.. డార్క్ ప్యాటర్న్స్‌పై IRDAI చర్యలు!

ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలకు చెక్.. డార్క్ ప్యాటర్న్స్‌పై IRDAI చర్యలు!

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ గురించి సెర్చ్ చేస్తే చాలు ముందుగా మొబైల్ నంబర్, ఈ-మెయిల్, వ్యక్తిగత వివరాలు అడుగుతుంటాయి చాలా కంపెనీలు. ఆ తర్వాత వరుసగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, పాలసీ కొనాలని ఒత్తిళ్లు.. కొన్న పాలసీ రద్దు చేయాలంటే క్లిష్టమైన ప్రక్రియ, చివరికి కనిపించని అదనపు ఛార్జీలు. ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురై ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మోసపూరిత డిజిటల్ ఎత్తుగడలపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI కఠిన చర్యలకు సిద్ధమైంది. పాలసీదారుల ప్రయోజనాల కోసం డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో జరుగుతున్న ‘డార్క్ ప్యాటర్న్స్’ను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది.

అసలు డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి?
డార్క్ ప్యాటర్న్స్ అంటే వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో ఉద్దేశపూర్వకంగా రూపొందించిన మోసపూరిత డిజైన్ పద్ధతులు. వినియోగదారుడు కోరుకోకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేయడం, వారిని తప్పుదారి పట్టించడం వీటి లక్ష్యం. ఉదాహరణకు పాలసీ వివరాలు చూడాలంటే తప్పనిసరిగా పర్సనల్ డీటైల్స్ ఇవ్వాల్సి రావడం, పాలసీని రద్దు చేయడం కష్టతరం చేయడం, దాచిపెట్టిన ఛార్జీలు వసూలు, పదే పదే కాల్స్ చేసి పాలసీలు కొనాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలు ఈ కోవలోకే వస్తాయి.

ఐఆర్‌డీఏఐ ఎందుకు రంగంలోకి దిగింది?
ఇన్సూరెన్స్ రంగంలో చాలా కాలంగా ‘మిస్-సెల్లింగ్’ పెద్ద సమస్యగా మారింది. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం బ్యాంకులను ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంకులు వినియోగదారులకు పూర్తిగా అర్థం కాని పాలసీలను విక్రయించడం, అవసరం లేని ఉత్పత్తులను బలవంతంగా అమ్మడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది. దీనిని అరికట్టేందుకు ఐఆర్‌డీఏఐ మొదట అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను సమీక్ష చేసుకోవాలని ఆదేశిస్తూ అవకాశం ఇచ్చింది. ఆశ్చర్యకరంగా దాదాపు అన్ని సంస్థలు తమ వద్ద ఎలాంటి డార్క్ ప్యాటర్న్స్ లేవని నివేదికలు సమర్పించాయి. దీంతో నిజానిజాలు తెలుసుకోవడానికి స్వతంత్ర పరిశీలన అవసరమని రెగ్యులేటరీ నిర్ణయించింది.

ఆడిట్‌తో అసలు నిజాలు బయటకు..
ఇందుకోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఆడిటర్స్ ఆఫ్ ఇండియా’తో ఐఆర్‌డీఏఐ చేతులు కలిపింది. 9 నెలల పాటు వివిధ సంస్థల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించి ఎక్కడ డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయో గుర్తించనున్నారు. అలాగే త్వరలో విడుదలయ్యే ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్కరణలపై కన్సల్టేషన్ పేపర్‌లో మిస్-సెల్లింగ్‌ను అరికట్టే కొత్త మార్గదర్శకాలు, పారదర్శకత పెంచే రూల్స్, కమిషన్ ఆధారిత విక్రయ విధానంలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది.

పాలసీదారులకు భారీ ఊరట..
కొత్త చర్యలు అమల్లోకి వస్తే పాలసీ కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు, ధరలు, ప్రయోజనాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేని వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన ఒత్తిడి తగ్గుతుంది. డిస్ క్లోజ్ చేయని ఛార్జీలు, మోసపూరిత ఆఫర్లు, బలవంతపు మార్కెటింగ్ కాల్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే పాలసీ రద్దు ప్రక్రియ కూడా మరింత ఈజీ కావచ్చు. అంటే వినియోగదారుడు తన అవసరానికి తగిన పాలసీని ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం పెరుగుతుంది.

ALSO READ : E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా ? 

ఒక సర్వే ప్రకారం దాదాపు 80 శాతం మంది వినియోగదారులు హిడెన్ ఛార్జీలు, డేటా షేరింగ్, పాలసీ రద్దులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. మరో 90 శాతం మంది అనవసరమైన కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోయినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ తీసుకున్న తాజా చర్యలు ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, పాలసీదారుల్లో విశ్వాసాన్ని బలోపేతం చేసే కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు మోసపూరిత డిజిటల్ ఎత్తుగడలు కాకుండా.. తమ బెస్ట్ సర్వీస్ చూపుతూ పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.