భారతీయ చలనచిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రం రూపొందుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.
గురువారం (2026 ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ’ టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 38 సెకన్ల నిడివి గల టీజర్ మహాద్భుతంగా ఉంది. రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారం కన్నుల పండుగగా ఉంది. రాజవస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించబడిన రాముడిగా, ఒక యోధుడిగా మరియు రాజుగా.. ఇలా ఆయన జీవితం గడిచిన కీలక ఘట్టాలను విజువల్ రూపంలో చూపించారు.
అయోధ్య నుండి వనవాసం వరకు, రాక్షసులు మరియు మహాకాయులతో జరిగిన యుద్ధాల వరకు శ్రీరాముడి ప్రయాణాన్ని ప్రేక్షకులకు అనుభూతి కలిగించేలా టీజర్ రూపొందించబడింది. అయితే, రావణుడుగా యశ్, సీతగా సాయి పల్లవిల ముఖాలని మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.
ఇందులో హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, లక్షణుడుగా రవి దూబే నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక గాథ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది. భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా 'రామాయణ' అడుగులు వేస్తోంది.
