జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

హైద‌రాబాద్: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రదర్శించిన సేవా నిరతిని కొనియాడారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం జరగాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బాటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్ అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.