
హైదరాబాద్, వెలుగు: గోద్రెజ్ అగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో సెక్రటేరియేట్ లో సమావేశమైంది. రాష్ట్రంలో కంపెనీని ఏర్పాటు చేస్తుండటంతో చర్చలు జరిపింది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ తమ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు తెలిపారు.
రాష్ట్రంలో కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు అవసరమైన మద్దతును అందిస్తామని సీఎం చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలంప్ మెంట్ ను ప్రోత్సహించాలని సూచించారు. రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లో రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని పరిశీలించాలని సీఎం కోరారు. గోద్రెజ్ అగ్రోవెట్ తెలంగాణలో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. మలేసియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను కంపెనీ ఏర్పాటు చేస్తోంది.