
- పేమెంట్ సీట్ల పేరుతో వసూళ్ల దందా
- అగ్రికల్చర్ సీటు 14 లక్షలు, హార్టికల్చర్ సీటు 9 లక్షలు
- అగ్రి, హార్టికల్చర్ యూనివర్సిటీల సీట్ల వ్యాపారం
- పావు వంతు సీట్లు పేమెంట్కే
- సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అడ్డగోలుగా ఫీజుల వసూలు
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీల్లోని గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పేమెంట్ సీట్ల పేరుతో భారీగా ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నరు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పావు వంతు సీట్లు పేమెంట్కే కేటాయించి దేశంలో ఎక్కడాలేని విధంగా అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోటా పేరుతో 159 సీట్లను కేటాయించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కో సీటుకు రూ.14 లక్షలు వసూలు చేస్తోంది. హార్టికల్చర్ యూనివర్సిటీ తామేం తక్కువ కాదన్నట్లు ఒక్కో సీటుకు రూ.9 లక్షలు తీసుకుంటున్నది. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు ఎక్కువగా ఉన్నా సమస్య లేదని, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన పేమెంట్ సీట్లకు లక్షల్లో వసూలు చేయడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు స్టూడెంట్ల ఫిర్యాదుతో పేమెంట్ సీట్ల పేరుతో ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సెంట్రల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ .. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. అయినా ఈ వర్సిటీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో వర్సిటీలు ఈయేడు ఫీజుల వసూళ్లకు తెరలేపాయి.
అగ్రికల్చర్ లో 159, హార్టికల్చర్లో 40 సీట్లు
అగ్రికల్చర్ వర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో 672 సీట్లలో పేమెంట్ కోటాలో 159 సీట్లను, బీఎస్సీ హార్టికల్చర్ వర్సిటీ 170 సీట్లలో పేమెంట్ కోటాలో 40 సీట్లను భర్తీ చేయడానికి గత ఆగస్టు 23న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. అగ్రికల్చర్ లో ఒక్కో పేమెంట్ సీటును రూ.14 లక్షలుగా నిర్ణయించారు. మొదట రూ.10,11,000ను డీడీ రూపంలో, తర్వాత రూ.39000 నగదుగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇలా ఫస్టియర్లో మొదట సెమిస్టర్లో రూ.10.50లక్షలు, మిగతా రూ.4.50 లక్షల్లో సెమిస్టర్కు రూ.50 వేల చొప్పున చెల్లించాలని నిబంధనల్లో తెలిపారు. వీటితో పాటు హాస్టల్, మెస్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పీజేటీఎస్ఏయూ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ పేమెంట్ కోటా నిండితే మొత్తం 159 సీట్లకు రూ.22.26 కోట్లు వసూలు చేయడానికి తెరలేపింది. పేమెంట్ కోటాకే ఇంత ఫీజు ఉంటే ఇక ఎన్ఆర్ఐ, స్పాన్సర్స్ కోటాలో ఒక్కో సీటుకు రూ.34 లక్షలుగా ఉండడం గమనార్హం.
ప్రైవేటు కంటే ఎక్కువే..
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల నోటిఫికేషన్లు ఏమీ లేకపోయినా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీజులు వసూలు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులు రూ.10 లక్షల లోపే ఉండగా, సర్కారు వర్సిటీల్లోనే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు హార్టికల్చర్, అగ్రికల్చర్ సీటు అందని ద్రాక్షగా మారిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.