ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాచర్ల పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళపై ఏప్రిల్ 2న గురువారం సాయంత్రం ఈ అమానుష ఘటన జరిగింది. నిందితుడు దాహంగా ఉందని మంచినీళ్లు కావాలని ఆమె ఇంట్లోకి ప్రశించాడు. ఆ సమయంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బాధితురాలు తనకు హెచ్ఐవి సోకిందని చెప్పిన వినలేదు. మరింత రెచ్చిపోయిన ఆ మృగం.. ఆమెను స్కార్ఫ్తో కట్టేసి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను తీవ్రంగా కొట్టి మర్మాంగాల్లోకి ఇనుప రాడ్ను చొప్పించి అక్కడి నుండి పరారయ్యాడు.
బాధితురాలితో కలిసి ఉంటున్న ఆమె మేనల్లుడు పదవ తరగతి పరీక్షలు ముగించుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో తన మేనత్తకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన బాలుడు వెంటనే తన స్నేహితులను, కుటుంబ సభ్యులను అక్కడికి వెళ్లమని కోరాడు. వారు వెళ్లి చూడగా బాధితురాలు అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది.
వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని తొలుత మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడి చికిత్స పొందుతున్నట్లు మాచర్ల టౌన్ సీఐ వెంకట రమణ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. పల్నాడు జిల్లా పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
