ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్.. తన లక్ష్యం నెరవేరకుండానే చనిపోవడం విషాదంగా మారింది. ఫ్రెండ్స్ తో గుడికి వెళ్తుండగా మరో వెహికిల్ ఢీకొట్టడంతో.. అనంత లోకాలకు వెళ్లింది. అమెరికాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీ లుబిన్ బిజినెస్ స్కూల్లో చదువుతోంది. ఫ్రెండ్స్ తో గుడికి వెళ్తుండగా మరో కార్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో చనిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రసన్న అట్లూరితో పాటు మరో యువతి కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వీళ్లతో పాటు ప్రయాణిస్తున్న మూడో అమ్మాయి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. జులై 06న జరిగింది ఈ ఘటన.
ప్రసన్న అట్లూరి ది ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామం. తండ్రి అట్లూరి వసంతరావు రైతు , తల్లి చిన్న సంచుల తయారీ యూనిట్ను నడుపుతున్నారు. అట్లూరి ఇటీవల అమెరికాలో తన చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
సహాయం కోసం విజ్ఞప్తి..
ప్రసన్న మృత దేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ఆమె బంధువు రవి కుమార్ అట్లూరి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ప్రసన్నే ఆధారంగా చెబుతున్నారు. చదువు కోసం సొంతంగా సంపాదించుకుంటూనే ఇంటికి డబ్బులు పంపించడం, ఇతరులకు సహాయం చేయడం చేస్తూ ఉండేదని చెబుతున్నారు.
ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రసన్న మృతదేహాన్ని ఇండియాకు పంపాలంటే75 వేల డాలర్ల లక్ష్యానికి గాను, ఇప్పటికే 40,000 డాలర్లకు పైగా జమ అయినట్లు చెబుతున్నారు. ఈ డబ్బును అంత్యక్రియల ఏర్పాట్లు,ఆమె బాడీని ఇండియా తరలించడం, కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులు, , ఆమె చెల్లించాల్సిన ఫీజుల కోసం వినియోగించనున్నట్లు చెప్పారు.
