
పేషెంట్ల నుంచి లక్షలకు లక్షలు వసూళ్లు
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకునే వారులేరు
మరణ వార్తను కూడా దాస్తున్నరు
మొత్తం ఫీజులు చేతికొచ్చిన తర్వాతే
పేషెంట్ చనిపోయిన విషయం చెప్తున్నరు
ఇన్సూరెన్స్ , పాలసీలు చెల్లవంటున్నరు
స్పాట్ లో క్యాష్ కడితేనే ట్రీట్ మెంట్
ప్రభుత్వ వాట్సప్ నంబర్కు 712 కంప్లైంట్స్ అందులో అడ్డగోలు చార్జీల గురించే ఎక్కువ
కంప్లయింట్ తీసుకొని చేతులు దులుపుకుంటున్న ఆఫీసర్లు
రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఫీజుల పేరిట కరోనా పేషెంట్లకు నరకం చూపిస్తున్నాయి. కరోనా బాధ కన్నా ఫీజుల కష్టమే ఎక్కువైందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ముందస్తుగా లక్షల రూపాయలు కడితే తప్ప చేర్చుకో లేమని చెప్పే హాస్పిటళ్లు కొన్నయితే.. చేర్చుకున్నాక లక్షలకు లక్షలు బిల్లు వేస్తున్న హాస్పిటళ్లు మరికొన్ని ఉన్నాయి. ఆ బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సి వస్త ోందని, బంగారం కుదువ పెట్టాల్సి వస్తోందని బాధితులు గోడువెళ్ల బోసుకుంటున్నారు. తమ బాధలను పేషెంట్లు, వారి బంధువులు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లయింట్ల మీద కంప్లయింట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: ‘‘రెండు రోజులు వెంటిలేటర్ పెట్టి.. పదిరోజులు జనరల్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ అందించినందుకు రూ. 18 లక్షల 22 వేలు ఫీజు వేశారు. ఒక పీపీఈ కిట్ కే రూ. 7,500 వసూలు చేశారు. మొత్తం ఫీజు చెల్లిస్తే కానీ.. డిశ్చార్జ్ చేయమన్నరు. అప్పటికే మేం రూ.10 లక్షలు కట్టినం. ఇంకా రూ. 8 లక్షలు ఏడికెంచి తేవాలి?” ఇదీ ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పి టల్ లో అడ్మిట్ అయిన కరోనా పేషెంట్ , అతడి బంధువుల ఆవేదన. ఈ ఒక్క హాస్పిటల్ లోనే కాదు రాష్ట్రం లోని చాలా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు కరోనా పేషెంట్లను ఇలా ఫీజుల పేరిట వేధిస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే నిర్బంధిస్తున్నాయి. ఆ బిల్లు లు కట్టలేక ఆస్తులు అమ్ము కోవాల్సి వస్తోందని బాధితులు గోస చెప్పుకుంటున్నారు. మరికొం దరైతే తమకు ఆ స్తోమత లేక శవాన్నే తీసుకుపోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రైవేటు హాస్పి టళ్లయితే పేషెంట్ చనిపోయినా.. ఫీజుల కోసం విషయాన్ని దాచి పెడుతున్నాయి. ఫీజు మొత్తం చేతి కందిన తర్వాతే మరణ వార్తను చెప్తున్నాయి. ఇన్సూరెన్స్ లు , హెల్త్ పాలసీలను యాక్సెప్ట్ చేయడం లేదు.
ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏ ఇబ్బంది ఉన్నా 9154170960 నెంబర్ కు వాట్సప్ చేయాలని జులై 16 నుంచి సర్వీసును సర్కారు ప్రా రంభించింది. అప్పటి నుంచి ఈ నెంబర్ కు కంప్లయింట్ల మీద కంప్లయింట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 712 మంది కంప్లయింట్ చేశారు. ఇందులో 90 శాతం ఫిర్యాదులు ఫీజుల దోపిడీపైనే ఉన్నా యి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏమన్నంటే.. గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అవండని ఆఫీసర్లు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుదామంటే.. అక్కడ పరిస్థితులు తలచుకుంటేనే భయమేస్తోందని అంటున్నారు. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం ..పట్టనట్లు వ్యవహరిస్తోందని మండి పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు కూడా ఏ ఒక్క ప్రైవేటు హాస్పిటల్ అమలు చేయడం లేదని, లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నాయని బాధితులు అంటున్నారు.
పేషెంట్ కండిషన్ కూడా చెప్తలేరు
రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం వారి బాగోగులను వాకబ్ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి పేషెంట్లు పరిస్థితి విషమిస్తే గవర్నమెంట్ హాస్పిటళ్ల మీద భరోసా లేక ప్రైవేటుకు వెళ్తున్నారు. అక్కడ బెడ్లు లేవనే సమాధానం వస్తోంది. ఉన్నా కొన్ని హాస్పిటళ్లు కావాలనే అలా చెప్తున్నాయి. ఆ తర్వాత లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయించుకొని అడ్మిట్ చేసుకుంటున్నాయి. అడ్మిట్ అయినా ఐసీయూలో ఖాళీ లేదని, రూమ్ కూడా అందుబాటులో లేదని ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నాయని, తర్వాత ప్రతిరోజు పొద్దున్నే స్టాఫ్ తమకు ఫోన్ చేసి చేసి ఉదయం 11 గంటలలోపు లక్ష రూపాయలు కట్టాలని చె బుతున్నారని పేషెంట్ల బంధువులు అంటున్నారు. పేషెంట్ కండిషన్ ను బట్టి ఇలా రోజువారీగా చెల్లించే మొత్తం రూ. 25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోందోని ప్రభుత్వ వాట్సప్ కు చాలా మంది బాధితులు కంప్లయింట్ చేశారు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి పది లక్షల నుంచి 20 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారని వారు గోడు వెళ్ల బోసుకుంటున్నారు. ఇన్ని డబ్బులు కట్టినా పేషెంట్ కండిషన్ ను బంధువులకు కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు చెప్పడం లేదు. సర్కారు వాట్సాప్ నెంబర్కు బాధితులు ఫోన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నెగెటివ్ వచ్చినా..!
కరోనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అని చెప్పి కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు ట్రీట్ మెంట్ చేస్తున్నాయి. అదేమంటే పేషెంట్ పరిస్థితి బాలేదని వారం తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నాయి. ఆ వారానికి నాలుగైదు లక్షలు గుంజుతున్నా యి. మరోవైపు పాజిటివ్ వచ్చి నార్మల్ గా ఉన్న వారిని కూడా ఐసీయూలో పెట్టి ట్రీట్ మెంట్ చేసి ఫీజులు ఎక్కువగా వేస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ ను ప్రైవేటు హాస్పిటళ్లు పట్టిం చుకోవడంలేదని పలువురు కంప్లయింట్ చేశారు. కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ఖరారు చేసిన ఫీజులు.. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల సే వలకు వర్తించవని ప్రభుత్వం సవరణ జీవో ఇచ్చింది. అయినా ప్రైవేటు హాస్పిటళ్లు నెట్ పేమెంట్ చెల్లి స్తేనే ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి.
మరణ వార్త దాస్తున్నరు
ట్రీట్ మెంట్ పేరుతో ఓ ప్రైవేటు హాస్పిటల్ దారుణంగా వ్యవహరించింది. మలక్ పేటకు చెందిన రషీదుఖాన్ అనే పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పి రూ.5 లక్షల బిల్లు కట్టించుకున్నారు. బిల్లు కట్టాక శవాన్ని అప్పగించారు. దీనిపై సర్కారు వాట్సాప్ నెంబర్ కు కంప్లయింట్ వచ్చింది. మరో హాస్పిటల్ వాళ్లు మొత్తం బిల్లు చెల్లించలేదంటూ డెడ్ బాడీని అప్పగించలేదు. అదేవిధంగా ట్రీట్ మెంట్ మధ్యలో ఎమర్జెన్సీ మెడిసిన్ పేరుతో ఓ చిట్టీ ఇచ్చి బయట తీసుకురావాలని, తమ దగ్గర లేదని కొన్ని హాస్పిటళ్లు చెబుతున్నాయి. ఇలా రాసే దాంట్లో ఒక ఇంజెక్షన్ రేటు రూ. 41 వేల దాకా ఉంటోంది. రేటు బాగా ఉందని, మీరే ఏదో ఒకటి చేయాలని పేషెంట్ల కుటుంబీకులు హాస్పిటల్ వారిని కోరుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు హాస్పిటళ్ల వారు ఆ ఇంజక్షన్ కు రూ.1.50 లక్షలు బిల్లు వేస్తున్నారు. కావాలనే తమను టెన్షన్ పెట్టి ఇలా ఎక్కువ వసూలు చేశారని సికింద్రాబాద్ కు చెందిన హరినారాయణ్ ఇటీవల సర్కార్ వాట్సప్ నంబర్ కు ఫిర్యాదు చేశాడు. రోజూ వందల ఫిర్యాదులు ప్రైవేటు హాస్పిటళ్లలో సర్వీసుపై రోజూ వందల కంప్లయింట్లు వస్తున్నాయని, ప్రతి కంప్లయింట్ ను రిజిస్టర్ చేసి ప్రభుత్వానికి చెబుతున్నామని వాట్సప్ నెంబర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఓ ఆఫీసర్ చెప్పారు.
గవర్నమెంట్ లో అట్ల.. ప్రైవేటులో ఇట్ల
విజయ్ .. ఓ రిపోర్టర్. చాలా కాలంగా హెల్త్ న్యూస్ రాస్తున్నడు. ఎందరో డాక్టర్లతో ఆయనకు పరిచయం ఉంది. ఇటీవల తన తల్లికి కరోనా సోకింది. గాంధీలో చేర్పించాడు. తనకంతా పరిచయమే కదా అని తల్లికి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందనుకున్నా డు. ఆమె పరిస్థితి కొంచెం విషమించింది. దీంతో ఐసీయూలో చేర్చారు. ట్రీట్మెంట్ సాగుతుండగా ఓరోజు సిబ్బంది వచ్చి ఆమె కాళ్లు కట్టేశారు. ఆమెకు మెలకువ వచ్చి అరిచింది. అప్పుడు వేరే స్టాఫ్ వచ్చి చనిపోయింది ఈమె కాదు.. వేరే పేషెంట్ అని చెప్పారు. విషయం తెలుసుకున్న విజయ్ వెంటనే తల్లిని ఒక ప్రైవేటు హాస్పిటల్కు షిఫ్ట్ చేశాడు. అక్కడ రోజుకు రూ. 70 వేలు కట్టాల్సిందేనని చెప్పారు. వాళ్లను వీళ్లను బతిమిలాడి చివరకు రోజు రూ. 50 వేలు కడుతున్నాడు. ఇంట్లో ఉన్న బంగారం అమ్మేశాడు. మరో 4 రోజుల్లో తల్లిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వాళ్లు చెప్పారు.