హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశపెట్టిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్)తో విద్యార్థులు, అధికారుల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. పీజీ 1, 3 సెమిస్టర్ విద్యార్థులకు అందజేసిన మెమోలతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. మెమోల్లో తప్పులు ప్రింటింగ్ మిస్టెక్స్ తో వచ్చాయా లేక సీబీసీఎస్ సిస్టంలో మార్పుల వల్ల చోటుచేసుకున్నాయా అని తేల్చుకోలేక స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు. దీనిపై అధికారులకు కూడా సరైనా అవగాహన లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మెమోల్లో తప్పులతో గత కొన్ని రోజులుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు వచ్చే విద్యార్థులు ఎక్కువవుతున్నారని అధికారులు తెలిపారు. గతంలో మెమోల్లో మార్కులను ఇచ్చేవారు. ఇప్పుడు సీబీసీఎస్ విధానంలో క్రెడిట్స్ రూపంలో ఇస్తున్నారు. దీంట్లో ఒక్కో సబ్జెక్టుకు 5 క్రెడిట్స్ గా విభజించారు. ఎగ్జామ్స్ లో స్టూడెంట్స్ చూపిన సామర్థ్యాలను బట్టి క్రెడిట్స్ రూపంలో మెమోల్లో పొందుపరుస్తారు. ఇంత వరకు బాగానే ఉంది. స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులలో పాసైనా ఆ మేరకు మెమోల్లో కన్పించడం లేదు. క్రెడిట్స్ స్థానంలో క్రెడిట్స్ లను ప్రింటింగ్ చేసినా ఫలితం స్థానంలో మాత్రం ఆబ్సెంట్ అని ఇచ్చారు. కొందరికి 5 కు 5 క్రెడిట్స్ వచ్చినా ఫలితం మాత్రం ఆబ్సెంట్ అని ఉంది. చాలా మంది విద్యార్థులకు ఇలానే వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో కంగారు పడిన విద్యార్థుల అధికారులను ఆశ్రయించగా దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని అధికారులు తెలిపారన్నారు. రోజు ఒకరిద్దరు ఎగ్జామినేషన్ బ్రాంచీకి ఇదే సమస్యతో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెమోల్లో టోటల్ పర్సెంటేజీ కాలం కూడా ఖాళీగా ఉంచడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
అధికారులు చొరవ తీసుకోవడం లేదు
విద్యార్థులకు సీబీసీఎస్ విధానాన్ని స్టూడెంట్స్ కు అలవాటు చేయడంలో ఓయూ అధికారులు చొరవ తీసుకోవడం లేదు. సెమిస్టర్ విధానంలో అకడమిక్ షెడ్యూల్ కూడా ఆన్లైన్ ఇవాల్యుయేషన్ ప్రక్రియపై ప్రభావం చూపుతున్నట్లు ఎగ్జామినేషన్ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల రాసిన పరీక్ష పేపర్లను వేరుచేసి వాటికి లేబులింగ్ చేస్తారు. ఈ క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొందరు విద్యార్థుల ఫలితాలు తారుమారు అయినట్లు అధికారులకు ఫిర్యాదులొచ్చినట్లు తెలిసింది. లేబులింగ్ చేసిన జవాబు పత్రాలను స్కానింగ్ చేసి లెర్చరర్లు దిద్దేందుకు వీలుగా సర్వర్లో నిక్షిప్తం చేస్తారు. పేపర్ల ఇవాల్యుయేషన్ అనంతరం ఆయా పేపర్లను తిరిగి డీ లేబులింగ్ చేసి మార్కులను విద్యార్థులకు కేటాయిస్తారు. సీబీసీఎస్ ఫలితాల్లో ఒక నిర్దిష్ట విధానం పాటించకపోవడం సందేహాలకు తావిస్తుంది. ఒక సబ్జెక్టులో పరీక్షలకు ఆబ్సెంట్ అయితే దానికి మాత్రమే ఆబ్సెంట్ అని చూపాల్సి ఉండగా అన్ని సబ్జెక్టుల్లో ఆబ్సెంట్ అని చూపుతుందని విద్యార్థులు వాపోతున్నారు.
పైగా టోటల్ మార్కులను సైతం పేర్కొనకపోవడం నిరాశకు గురిచేస్తుందని స్టూడెంట్స్ బాధపడుతున్నారు.
ఏటా 180 రోజులు క్లాసులు
సెమిస్టర్ సిస్టంలో ఖచ్చితంగా 90 రోజులు క్లాస్లు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు సెమిస్టర్లకు కలిపి ఏటా 180 రోజులు క్లాస్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు సెమిస్టర్ విధానం కారణం ఏటా రెండు సార్లు ఇవాల్యుయేషన్ చేయాల్సి రావడం, అందులో ఆన్లైన్ పద్ధతిలో ఇవాల్యుయేషన్ ప్రక్రియ కారణంగా ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పీజీ 1,3 సెమిస్టర్ విద్యార్థుల ఫలితాల వెల్లడికి దాదాపు 5 నెలలు సమయం పట్టింది. ఫలితాల వెల్లడికి విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశారు. దీంతో ఓయూ ఎగ్జామినేషన్ అధికారులు ఫలితాలు వెల్లడించకుండా నేరుగా విద్యార్థులకు మెమోలు అందజేశారు. అవి కూడా అందరికి ఒకే దఫాలో కాకుండా విడతల వారీగా అందజేస్తున్నారు. పీజీ 2, 4 సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ వెంటనే వెకేషన్స్ ప్రకటించారు. జూలై 15 తర్వాత వెకేషన్స్ అనంతరం విద్యార్థులకు మెమోల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు.
ప్రింటింగ్ మిస్టేక్ మెమోలు జారీ అయ్యాయి
సీబీసీఎస్లో విద్యార్థులకు జారీచేసే మెమోలు మిగతా మెమోల కంటే భిన్నంగా ఉంటాయి. స్టూడెంట్స్ కు వాటిపై అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ ఇవాల్యుయేషన్ వచ్చిన తర్వాత పరీక్ష పేపర్ లేబులింగ్, కంప్యూటర్ ఆపరేటర్ల తప్పుల కారణంగా కొంత మంది విద్యార్థులకు ప్రింటింగ్ మిస్టేక్ మెమోలు జారీ అయ్యాయి. ఆయా విద్యార్థులు తమను సంప్రదిస్తే వెంటనే తప్పులను సవరించి కొత్త మెమోలను అందజేస్తాం. ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓయూ