
- నిత్యావసర ధరలు తగ్గించినప్పుడే విశ్వగురు అవుతవ్
- ప్రతిపక్షాలను అవమానించడం మానుకోవాలని సూచన
రాయచూరు: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. నిత్యావసర ధరలు తగ్గించినప్పుడే విశ్వగురు అవుతారని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హితవు పలికారు. సోమవారం కర్నాటకలోకి రాయచూరులో సీఎం సిద్ధరామయ్యతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ప్రధాని అదేపనిగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పహల్గాం దాడి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసిందే ప్రతిపక్షాలని గుర్తుచేశారు.
ఆ దాడి తర్వాత రెండుసార్లు అఖిలపక్ష సమావేశం జరిగినా.. ప్రధాని ఆ మీటింగ్ లకు హాజరుకాకుండా అపొజిషన్ పార్టీలను అవమానించారని ఖర్గే ఫైర్ అయ్యారు. ఎంతో మంది ఎన్నో ముఖ్యమైన పనులు వదులుకొని అఖిలపక్ష భేటీకి హాజరయ్యారని, ప్రధాని ఎందుకు హాజరు కాలేదని ఆయన నిలదీశారు. ‘‘అఖిలపక్ష సమావేశాలకు ప్రధాని హాజరుకారు. కానీ, ఆపరేషన్ సిందూర్ కు మాత్రం క్రెడిట్ తీసుకుంటారు. ఆర్మీలో ఆయన (మోదీ) ఏమన్నా సేవలందించారా? నిజంగా ఆయన సేవలందించి ఉంటే, క్రెడిట్ తీసుకున్నా అంగీకరించేవాళ్లం.
కానీ, ఏమీ చేయకుండానే క్రెడిట్ ఎట్లా తీసుకుంటారు?” అని ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా ప్రతీకార సుంకాలు వేసినా.. మోదీ నోరు విప్పడం లేదన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ పైనా ఖర్గే స్పందించారు. ‘‘మన దేశానికి 50 శాతం చమురు ఇరాన్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపేందుకు కేంద్రం ప్రయత్నించి ఉండాల్సింది” అని ఖర్గే పేర్కొన్నారు.