రంగారెడ్డి: అడ్డగోలుగా భూసేకరణ చేసి సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కడుపుకొడుతున్నాడని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాళ్ళ పాపం తగిలి సీఎం నాశనమై పోతాడని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫార్మా సిటీ భూ బాధిత రైతుల సమావేశం జరిగింది. . ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మాల్ రెడ్డి రంగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సుంకేట అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల భూములకు తక్కువ పరిహారం ఇచ్చి ఆ భూములను ఎక్కువ ధరలకు ఫార్మా కంపెనీలకు అమ్ముకోవాలని కేసీఆర్ చూస్తున్నాడన్నారు. సీఎం బ్రోకర్ లా వ్యవహరిస్తున్నాడన్నారు. ఫార్మా కంపెనీ లకు ఈ భూములిస్తే వాటి నుంచి వచ్చే విషవాయువుల స్థానికులు బతకలేని పరిస్థితి వస్తుందన్నారు. ‘ఫామ్ హౌజ్ గజ్వేల్లో కట్టుకోవడం కాదు.. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని.. కేసీఆర్ కు అప్పుడు తెలుస్తుందని’ అన్నారు జీవన్ రెడ్డి. గరీబోని కడుపులు కొడుతున్న కేసీఆర్ పాపం ఊరికే పోదని హెచ్చరించారు.