నోట్లతో వైరస్ వస్తుందనే భయం
పెరిగిన డిజిటల్ పేమెంట్స్
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్జనాలను అన్ని రకాలుగా భయపెడుతోంది. ఏ వస్తువు ముట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అది ఇంటికి వచ్చే పాల ప్యాకెట్అయినా, కరెన్సీ నోటైనా పట్టుకోవాలంటే హడలిపోతున్నారు. బయటి నుంచి ఏ వస్తువు తెచ్చినా శుభ్రంగా కడిగాకే వాడుతున్నారు. కానీ నోట్లపై వైరస్ ఉంటుందని అనుమానం ఉన్నా నీళ్లు, శానిటైజర్తో తొలగించే పరిస్థితి లేకపోవడంతో డిజిటల్పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు.
నోటు ముట్టకున్నా వాష్ చేసుకోవాల్సిందే..
కరోనా సోకిన వ్యక్తి కరెన్సీ నోటును ముట్టుకుంటే అది చాలా మంది చేతులు మారే అవకాశముంటుంది. కొందరు వేలిని నోటితో తడి చేసి నోట్లను లెక్కిస్తారు. దీనివల్ల వైరస్ విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో కస్టమర్లయినా, షాపు ఓనర్లయినా డిజిటల్పేమెంట్స్కే ఆసక్తి చూపిస్తున్నారు. రూపాయి నుంచి మొదలుకుని ఎన్ని వందలైనా ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, అమెజాన్ పే, ఫ్రీచార్జ్ లాంటి యాప్స్ఉపయోగించి చేస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు తీసుకోవాల్సి వస్తే చేతులు కడుక్కోవడమే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.