గాంధీలో కరోనా పేషెంట్ల ఆవేదన

గాంధీలో కరోనా పేషెంట్ల ఆవేదన

పద్మారావునగర్, వెలుగు:  గాంధీ హాస్పిటల్ లో చేరిన కరోనా పేషెంట్లకు హెల్దీ ఫుడ్​ అందట్లేదు. ఫస్ట్​ వేవ్​లో అందించిన కొవిడ్​ స్పెషల్​ డైట్​ను 2 నెలల క్రితమే అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం గాంధీలో అడ్మిట్​ అవుతున్న కరోనా పేషెంట్లకు కూడా సాధారణ డైట్ అందిస్తున్నారు. ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వకపోతే తొందరగా ఎలా రికవరీ అవుతామని పేషెంట్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్​ వేవ్​ టైమ్ లో 2020 జులై 15 నుంచి  కరోనా పేషెంట్లకు ఇమ్యూనిటీ ఫుడ్​ అందించాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. రైస్, చికెన్, చపాతీలు, బాదామ్​, పిస్తా, ఎగ్స్​, ఇడ్లీ, పాలు, ఉప్మా ఇలా .. ఏ పూటకు ఆ పూట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ లో కరోనా వార్డుల్లోని పేషెంట్లకు హెల్దీ ఫుడ్​ను  అందించేవారు. సెకండ్ వేవ్ టైమ్ లోనూ దీన్నే కొనసాగించారు.  ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో 2 నెలల క్రితం అధికారులు స్పెషల్ డైట్ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. కొన్నిరోజులుగా  ఒమిక్రాన్ వేరియంట్​నేపథ్యంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీలో ప్రస్తుతం  160 మంది కరోనా​ పేషెంట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కానీ  వారికి స్పెషల్ డైట్  అందించే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  కేవలం పప్పు, అన్నం,కూర, పెరుగు మాత్రమే ఇస్తున్నారని, ఇలాంటి ఫుడ్ తో తాము రికవరీ కావడం ఎలా అని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరోనా స్పెషల్ డైట్ ను  మళ్లీ అమలు చేయాలని  కోరుతున్నారు. 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా..

వైద్య ఉన్నతాధికారులతో బుధవారం  జూమ్‌‌ మీటింగ్‌‌ జరిగింది.  కొవిడ్​ డైట్‌‌ను మళ్లీ అమలు చేసే విషయాన్ని  చెప్పాను.  కరోనా హాస్పిటల్స్ లో ఈ డైట్​ను రిపీట్​ చేయడానికి  హెల్ద్​ డిపార్ట్​మెంట్​ సానుకూలంగా స్పందించింది. తొందరలోనే పేషెంట్లకు స్పెషల్​ డైట్ అందిస్తాం. 
- డా. రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌‌