మంచిర్యాల: NH 63కి లైన్ క్లియర్...అలైన్ మెంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు

మంచిర్యాల: NH 63కి లైన్ క్లియర్...అలైన్ మెంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు
  •      భూసేకరణ కేసులో తుది తీర్పు 
  •      పెండింగ్​లో ఉన్న మరో కేసులోనూ ఇదే రకమైన ఆర్డర్​ వచ్చే చాన్స్​ 
  •      పర్యావరణ అనుమతులకు ముందే 3డీ నోటిఫికేషన్​ఇవ్వడంపై ఆబ్జెక్షన్​
  •      త్వరలోనే టెండర్లు.. మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం

మంచిర్యాల, వెలుగు:  నిజామాబాద్ ​జిల్లా ఆర్మూర్​ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న నేషనల్​ హైవే 63కి అడ్డంకులు తొలగినట్టే. గ్రీన్ ఫీల్డ్​ హైవే అలైన్​మెంట్, భూసేకరణను సవాల్​ చేస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఇటీవల తుది తీర్పు వెలువరించింది. అలైన్​మెంట్ మార్పునకు ఆదేశాలు ఇవ్వాలన్న రైతుల అభ్యర్థనను తిరస్కరిస్తూ అందులో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే పర్యావరణ అనుమతులు రావడానికి ఏడాది ముందే భూసేకరణకు సంబంధించిన 3డీ నోటిఫికేషన్​ జారీ చేయడంపై నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ఇండియా(ఎన్ హెచ్ఏఐ) తీరును తప్పుబట్టింది. కోర్టు ఆదేశాల మేరకు గతంలో జారీ చేసిన 3డీ నోటిఫికేషన్​ను రద్దు చేస్తూ త్వరలోనే మరో నోటిఫికేషన్​ ఇవ్వనున్నామని ఎన్​హెచ్​ఏఐ అధికారులు వెల్లడించారు. హైకోర్టులో పెండింగ్​ ఉన్న మరో కేసులోనూ ఇదే రకమైన ఆర్డర్​వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే టెండర్​ ప్రక్రియ పూర్తి చేసి రెండు నుంచి మూడు నెలల్లో గ్రీన్​ఫీల్డ్​ హైవే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

131.8 కిలోమీటర్లు.. రూ.5,202.08 కోట్లు

ఆర్మూర్ ​నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు 131.8 కిలోమీటర్ల మేర ఎన్​హెచ్​63ని ఫోర్​లేన్​గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లోనే గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. అప్పటినుంచి మూడుసార్లు అలైన్​మెంట్​ మారడంతో పాటు భూసేకరణ సమస్యలు రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా జూన్​3న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్​ఎకనామిక్​ అఫైర్స్​ గ్రీన్​ఫీల్డ్​ హైవేకు ఆమోదం తెలిపింది. ఆర్మూర్​ నుంచి జగిత్యాల వరకు 63.600 కిలోమీటర్లకు గాను రూ.2,471.76 కోట్లు, జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 68.295 కి.మీ. గాను రూ.2,730.72 కోట్లు, మొత్తం రూ.5,202.08 కోట్లతో ఆమోదించింది. హ్యామ్​ పద్ధతిలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినప్పటి నుంచి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 

అలైన్​మెంట్​లో జోక్యం చేసుకోలేమన్న కోర్టు 

ఎన్ హెచ్ 63 అలైన్​మెంట్​ను మూడుసార్లు మార్చడమే కాకుండా గ్రీన్​ఫీల్డ్​ హైవే కోసం తమ వ్యవసాయ భూములను తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ హాజీపూర్​ మండలానికి చెందిన పలువురు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రోడ్డు పనులను టెంపరరీగా నిలిపివేయాలని అప్పట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ నెల 6న వెలువరించిన తుది తీర్పులో రోడ్డు అలైన్​మెంట్​విషయంలో తమ పరిధి పరిమితమని స్పష్టం చేస్తూ అందులో జోక్యానికి నిరాకరించింది. సాంకేతిక అంశాలు, ప్రజావసరాల మేరకు ఎన్​హెచ్​ఏఐ అలైన్​మెంట్ ​రూపొందిస్తుందని కామెంట్​ చేసింది. 

అయితే భూసేకరణకు సంబంధించి ఎన్​హెచ్​ఏఐ జారీ చేసిన 3డీ నోటిఫికేషన్​ను హైకోర్టు రద్దు చేసింది. 2025 ఏప్రిల్​26న పర్యావరణ అనుమతులు రాగా, దానికి ఏడాది ముందు అంటే 2024 జూలై 18న 3డీ నోటిఫికేషన్​ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు మరోసారి 3డీ నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ అవార్డు పాస్​ చేయనున్నట్టు ఎన్​హెచ్​ఏఐ అధికారులు తెలిపారు. 

ఆర్బిట్రేషన్ ద్వారా పెరగనున్న నష్టపరిహారం

గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో పలువురు రైతులు సాగు భూములను కోల్పోగా, మిగిలిన కాస్త భూములను గ్రీన్​ఫీల్డ్ హైవే కోసం సేకరిస్తున్నారని, కాబట్టి అలైన్​మెంట్​ మార్చాలనేది రైతుల ప్రధాన డిమాండ్. కానీ అలైన్​మెంట్​లో జోక్యం చేసుకోలేమేని హైకోర్టు స్పష్టం చేయడంతో రైతులకు నిరాశమిగిలింది. అయితే రైతుల కోల్పోతున్న భూములకు ప్రస్తుతం నిర్ణయించిన నష్టపరిహారం తీసుకొని ఆర్బిట్రేషన్​కు అప్లై చేసుకుంటే మరింత ఎక్కువ పరిహారం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.