హైదరాబాద్, వెలుగు: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కోరారు. ఈ మేరకు గురువారం జేఏసీ ప్రతినిధి బృందం ఆయనను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. మహిళా రిజర్వేషన్ల అమలును సెన్సస్, డీలిమిటేషన్ ప్రక్రియలతో ముడిపెట్టకూడదని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని వారు పీసీసీ చీఫ్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు.
