హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ప్రారంభించారు. 108.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పనులను రూ.28 కోట్లతో చేపడుతున్నారు. కట్ట, వాకింగ్ పాత్, పార్కులు, పిల్లల ఆట స్థలాలు, ఓపెన్ జిమ్లు, యోగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయనున్నారు.
రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువులో 10 అడుగుల మేర పూడిక తొలగిస్తున్నామని, 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యాప్రాల్లోని నాగిరెడ్డికుంట అభివృద్ధి పనులను కూడా హైడ్రా చేపడుతుందని తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
