
హైదరాబాద్, వెలుగు: గ్రామ స్థాయిలోనే కరోనా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం బీఆర్కే భవన్లో ఫార్మా కంపెనీలు, డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గ్రామాల్లో జ్వరాలతో బాధపడే వారిని హెల్త్ సబ్ సెంటర్ సిబ్బంది గుర్తించి పీహెచ్సీకి తరలిస్తారని, అక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వైరస్ సోకినట్లు తేలినా లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తామని, ఎవరికైనా వైద్యం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు. కరోనా చికిత్సకు అవసరమైన మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంత ఖర్చయినా మందులు కొనుగోలు చేస్తామని చెప్పారు. కరోనా మందులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కట్టడి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మెడికల్ షాపులో యాంటిబయాటిక్స్, సిట్రిజిన్, పారాసిటమాల్, డెక్సమెథసోన్, మల్టీ విటమిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్లాబ్లెట్లు, ఇంజక్షన్లు, కాఫ్ సిరప్ అందుబాటులో ఉంచాలన్నారు. వైరస్ లోడ్ తగ్గించడానికి ఉపయోగిస్తున్న రెమెడెసివర్ మందులు అవసరం మేరకు సప్లయ్ చేయాలన్నారు. సమీక్షలో డ్రగ్ కంట్రోలర్ ప్రీతిమీనా, అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.