- ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి
- 9 లక్షలు దాటిన కౌంట్
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 15 రోజులుగా దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కాగా బుధవారం ఒక్కరోజే 32, 695 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కి చేరింది. వాటిలో 3,31,146 యాక్టివ్ కేసులు కాగా.. 6,12,815 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు. వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 24,915కి చేరిందని అధికారులు చెప్పారు. 24 గంటల్లో 606 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,27,39,490 టెస్టులు చేశామని ఐసీఎమ్ఆర్ ప్రకటించింది. వాటిలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,26,826 మందికి టెస్టులు చేసినట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 7,975, తమిళనాడులో 4,496, కర్నాటకలో 3,176, ఆంధ్రప్రదేశ్లో 2,432, ఉత్తర్ప్రదేశ్లో 1659 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.