తక్కువ ధర అంటూ నకిలీ బంగారం.. రూ.5 లక్షలు మోసపోయిన నల్గొండ మహిళ

తక్కువ ధర అంటూ నకిలీ బంగారం.. రూ.5 లక్షలు మోసపోయిన నల్గొండ మహిళ

నల్గొండ: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశపడిన ఓ మహిళ మోసానికి గురైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. నిడమనూరుకు చెందిన ఓ మహిళను నకిలీ బంగారంతో దుండగుడు మోసం చేశాడు. మహిళ ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానంటూ నకిలీ బంగారు కడ్డీలు ఇచ్చి, బంగారం అంటూ నమ్మించాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు నగదును తీసుకుని పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన మహిళ కుటుంబ సభ్యులు జ్యువెల్లరీ షాపుకెళ్లి బంగారు కడ్డీలను పరిశీలించమని అడుగగా.. అది బంగారం కాదని షాపు యజమాని చెప్పడంతో షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.