మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తల్లి, నాలుగు నెలల శిశువు మృతి చెందిన ఘటన పెను విషాదం నింపింది. ఆ పసికందు తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి మండలం కంచిరేవుపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ రెడ్డి తన కుటుంబంతో కలిసి TS 32 E 6167 నంబర్ కారులో యాదగిరిగుట్టకు వెళ్తున్నారు.
కారు అదుపు తప్పి అరటి కాయల లోడుతో ఆగి ఉన్న TN 52 M 1776 నంబర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నందిని (21), ఆమె నాలుగు నెలల కుమారుడు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ రెడ్డిని వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

