
- డిగ్రీ, పీజీలో వాటినే ఎంచుకున్న ఎక్కువ మంది
- బీఏలో 90 లక్షలు, బీఎస్సీలో 47లక్షల మంది చేరిక
హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా ఆర్ట్స్ కోర్సుల క్రేజ్ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. యూజీ లెవెల్లో బీకాం, బీఎస్సీతో పోలిస్తే బీఏలోనే స్టూడెంట్లు భారీగా చేరుతున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ మోడ్లో బీఎస్సీలో 47,23,925 మంది, బీకాంలో 38,72,487 మంది చదివితే, బీఏను మాత్రం ఏకంగా 90,43,884 మంది చదివారు.
కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ) చేసిన 2021–22 సర్వే రిపోర్టు తాజాగా విడుదలైంది. ఈ సర్వేలో దేశంలోని1,162 వర్సిటీలు,45,473 కాలేజీలు ఉండగా, 42,825 కాలేజీలు సర్వేలో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4.33 కోట్ల మంది ఉన్నత విద్యను చదువుతున్నారని, ఇందులో 15.3 %ఎస్సీలు, 6.3% ఎస్టీలు, 37.8% బీసీలు ఉన్నారని పేర్కొన్నారు.
రిపోర్టులోని ముఖ్యాంశాలు..
2017–18లో బీఏలో 78.54 లక్షల మంది చేరగా, 2021–22లో ఆ సంఖ్య 90.43 లక్షలకు పెరిగింది. బీఎస్సీలో మాత్రం 45.97 లక్షల మంది నుంచి 47.23 లక్షలకు చేరింది. బీటెక్లో 2017–18లో 39.40 లక్షల మంది చేరితే, 2021–22లో 38.45 లక్షలకు తగ్గింది. బీఫార్మసీలో 2.25 లక్షల నుంచి 4.51 లక్షలకు పెరిగింది. ఎంబీబీఎస్లో 2.41 లక్షల నుంచి 3.20 లక్షలకు చేరింది.
ఎంఏలో 2017–18లో 9.01లక్షల మంది చేరితే, 2021–22లో 11.40 లక్షల మంది చేరారు. ఎంకామ్లో 4.21లక్షల నుంచి 5.25 లక్షలకు, ఎంఎస్సీ 6.05 లక్షల నుంచి 8.34 లక్షలకు పెరిగింది. డిస్టెన్స్ మోడ్లోనూ బీఏ, ఎంఏలోనే ఎక్కువ మంది చదువుతున్నారు. బీఏలో 19,46,123 మంది, బీఎస్సీలో 2,20,782 మంది చదవగా, ఎంఏలో 8,24,709 మంది, ఎంఎస్సీలో 1,52,082 మంది చదివారు.