హైదరాబాద్, వెలుగు: ఐటీ ఇండస్ట్రీకి సైబర్ అటాక్స్ సవాళ్లుగా మారాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 10 వేల నుంచి 30 వేల వరకు సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీపై సైబర్ దాడులను నివారించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబరాబాద్ పోలీసులు ‘లా ఎన్ఫోర్స్మెంట్ సీఐఎస్ఓ కౌన్సిల్’ను ఏర్పాటు చేశారు.
ఈ కౌన్సిల్ను డీజీపీ అంజనీ కుమార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర, ఐటీ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఐటీ కంపెనీలు, పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, పోలీసులతో కలిసి సీఐఎస్ఓ కౌన్సిల్ ఏర్పాటైందన్నారు. దీని ద్వారా ఐటీ ఇండస్ట్రీపై ఎలాంటి మాల్వేర్స్ అటాక్స్ జరిగినా సమాచారం షేర్ చేసుకునేందుకు, డేటా ప్రొటెక్షన్, హ్యాకింగ్ నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
రాన్సమ్వేర్ దాడుల పట్ల ఐటీ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన సైట్స్, సర్వర్లు సైబర్ అటాక్స్కు గురికాకుండా మూడు రకాల టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, టెక్నాలజీ ద్వారా సైబర్ దాడులను అరికడుతున్నామని చెప్పారు.
దీంతో అన్ని ప్రభుత్వ సైట్స్ సెక్యూర్గా ఉన్నాయని తెలిపారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ కౌన్సిల్లో ఐటీ కారిడార్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలను భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక ఎస్ఓపీని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.