
- నాలుగో విక్టరీతో టాప్ ప్లేస్ కు
- రాణించిన స్టోయినిస్ , పృథ్వీ, బౌలర్లు
ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి దంచికొట్టింది. ఈ సీజన్లో అండర్ డాగ్గా బరిలోకి దిగిన ఆ జట్టు అద్భుత ఆటతో దూసుకెళ్తోంది. షార్జాలో లాస్ట్ మ్యాచ్లో కోల్కతాపై పరుగుల మోత మోగించిన ఢిల్లీ ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెక్ పెట్టింది. టాప్ క్లాస్ ఆటతో కోహ్లీసేనకు దడపుట్టించింది. మార్కస్ స్టోయినిస్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్), పృథ్వీ షా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) ధనాధన్ బ్యాటింగ్కు తోడు బౌలర్లూ రాణించడంతో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. దాంతో లీగ్లో నాలుగో విక్టరీతో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. మరోవైపు బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయిన బెంగళూరు భారీ టార్గెట్ ఛేజింగ్లో కోహ్లీ తప్ప మిగతా వాళ్లంతా ఫెయిలవడంతో లీగ్లో రెండో ఓటమి మూటగట్టుకుంది.
దుబాయ్: సమ ఉజ్జీల సమరం ఏకపక్షమైంది. వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గి జోరు మీదున్న బెంగళూరు ఈ సారి తీవ్రంగా నిరాశ పరిచింది. టాప్ క్లాస్ ఆటతో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 59 పరుగుల తేడాతో చాలెంజర్స్పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 196/4 స్కోరు చేసింది. స్టోయినిస్, షాతో పాటు రిషబ్ పంత్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), శిఖర్ ధవన్ (28 బంతుల్లో 3 ఫోర్లతో 32) కూడా రాణించారు. అనంతరం ఓవర్లన్నీ ఆడిన ఆర్సీబీ 9 వికెట్లకు 137 రన్స్ చేసి ఓడిపోయింది కెప్టెన్ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 43) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో రబాడ (4/24) నాలుగు, అక్షర్ పటేల్ (2/18), నోర్జ్ (2/22) రెండేసి వికెట్లతో రాణించారు. అక్షర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్టోయినిస్, పృథ్వీ ఫటాఫట్
ఢిల్లీ ఇన్నింగ్స్లో పృథ్వీ షా, మార్కస్ స్టోయినిస్ హీరోలుగా నిలిచారు. స్టార్టింగ్లో పృథ్వీ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకున్న మార్కస్ స్టోయినిస్ చివరి వరకూ ధనాధన్ ఆటతో చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ధవన్, పంత్ నుంచి వీరికి మంచి సహకారం అందింది. జోరు మీదున్న పృథ్వీ ఈ మ్యాచ్లోనూ ఫామ్ కొనసాగించారు. ఉడాన (1/40) వేసిన ఫస్ట్ ఓవర్లోనే మూడు ఫోర్లతో ఆర్సీబీకి హెచ్చరికలు పంపాడు. సైనీ (0/48)బౌలింగ్లో ఫోర్తో ధవన్ కూడా బౌండ్రీల ఖాతా తెరువగా, పృథ్వీ కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టాడు. పవర్ ప్లేలో ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న షా మంచి టైమింగ్, టెక్నిక్తో షాట్లు రాబట్టాడు. దాంతో, ఫిఫ్త్ ఓవర్లోనే తమ ట్రంప్ కార్డ్ చహల్ (0/29)ను కోహ్లీ బౌలింగ్కు దింపాడు. జోరు తగ్గని షా 4, 6.. ధవన్ 4తో అతనికి వెల్కమ్ చెప్పారు. ఓపెనర్ల ధాటికి పవర్ప్లేలో ఢిల్లీ 63 రన్స్ రాబట్టింది. ఫస్ట్ ఆరు ఓవర్లలో స్పిన్నర్ సుందర్ (0/20)మూడు ఓవర్లు వేయడం విశేషం. అయితే, భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన షా స్పీడుకు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (2/34)తన ఫోర్త్ బాల్కే బ్రేక్ వేశాడు. ఏడో ఓవర్లో అతను వేసిన బాడీలైన్ షార్ట్ బాల్ను షా లెగ్ సైడ్ కొట్టే ప్రయత్నం చేయగా గ్లోవ్స్కు తాకి కీపర్ ఏబీ చేతిలో పడింది. అక్కడి నుంచి ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. సిరాజ్, సుందర్తో పాటు ఉడాన, చహల్, మొయిన్ అలీ (1/21)పరుగులు కట్టడి చేశారు. దాంతో, 8 నుంచి 12 ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా కొట్టని ఢిల్లీ.. ధవన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11) వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఉడాన బౌలింగ్లో ధవన్ ఔటవగా.. అలీ వేసిన 12వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ బౌండ్రీ లైన్ వద్ద పడిక్కల్ పట్టిన అద్భుత క్యాచ్కు అయ్యర్ వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్ల జోరు చూస్తుంటే ఢిల్లీ 160–170 రన్స్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, ఈ టైమ్లో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అనూహ్యంగా చెలరేగాడు. చహల్ బౌలింగ్లో పంత్ ఫోర్ కొట్టగా, అలీ ఓవర్లో 6, 4 బాదిన స్టోయినిస్ ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. దాంతో కోహ్లీ మళ్లీ పేసర్ సైనీని బౌలింగ్కు దింపగా మార్కస్ 6, 4, 4 బాదాడు. ఆ ఓవర్ లాస్ట్ బాల్కు అతనిచ్చిన ఈజీ క్యాచ్ను చహల్ మిస్ చేశాడు. అప్పటికి 30 రన్స్ వద్ద ఉన్న మార్కస్ ఈ చాన్స్ను సద్వినియోగం చేసుకున్నాడు. సైనీ వేసిన 17వ ఓవర్లో 6, 4తో పంత్ కూడా గేరు మార్చాడు. సిరాజ్ బౌలింగ్లోనూ ఓ సిక్సర్ కొట్టిన అతను మరో షాట్ ఆడే ప్రయత్నంలో బౌల్డ్ అవడంతో ఫోర్త్ వికెట్కు 89 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అదే ఓవర్లో ఫోర్తో స్టోయినిస్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇక, ఉడాన వేసిన లాస్ట్ ఓవర్లో హెట్మయర్ (11 నాటౌట్) సిక్సర్ సహా 12 రన్స్ రావడంతో ఢిల్లీ 200 మార్కుకు చేరువగా వచ్చింది.
బెంగళూరు తడబాటు
పెద్ద గ్రౌండ్లో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచిన ఢిల్లీ అద్భుత బౌలింగ్తో దాన్ని డిఫెండ్ చేసుకుంది. ఆ టీమ్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేయడంతో ఛేజింగ్లో బెంగళూరు ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (4), ఆరోన్ ఫించ్ (13)తో పాటు ఫామ్లో ఉన్న ఏబీ డివిలియర్స్ (9) వికెట్లు కోల్పోయింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడు హాఫ్ సెంచరీలతో జోరు మీదున్న దేవదత్.. థర్డ్ ఓవర్లో అశ్విన్ (1/26) స్లో బాల్కు స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే రెండు క్యాచ్ ఔట్ల నుంచి తప్పించుకున్న ఫించ్ నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఆరో ఓవర్లో ఏబీ కూడా వెనుదిరిగాడు. నోర్జ్ వేసిన లెంగ్త్ బాల్ను మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా సరిగ్గా కనెక్ట్ కాలేదు. దాంతో, ధవన్ సింపుల్ క్యాచ్ అందుకున్నాడు. అదే ఓవర్లో అశ్విన్ డైరెక్ట్ త్రో మిస్సవడంతో కోహ్లీ రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఓవరాల్గా పవర్ ప్లేలో 43/3తో డీలా పడ్డ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత కోహ్లీ, సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్ అలీ (11)పై పడింది. కొద్దిసేపు ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో పది ఓవర్లకు ఆర్సీబీ 63/3తో నిలవగా.. సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. స్పీడు పెంచే ప్రయత్నంలో అక్షర్ వేసిన 12వ ఓవర్లో షాట్ ఆడిన అలీ.. లాంగాన్లో హెట్మయర్కు చిక్కడంతో బెంగళూరు మరింత డీలా పడింది. ఈ టైమ్లో హర్షల్ బౌలింగ్లో 6, 4తో కోహ్లీ గేరు మార్చాడు. కానీ, రబాడ వేసిన తర్వాతి ఓవర్లో మరో షాట్ ఆడే ప్రయత్నంలో అతను కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఓటమి ఖాయమైంది. రబాడ బౌలింగ్లోనే వాషింగ్టన్ సుందర్ (17), దూబే (11), ఉడాన (1) కూడా వెనుదిరిగారు.