దిల్లీలో కొత్త రూల్స్.. పాత వాహనాలకు జూలై 1 నుంచి 'NO' పెట్రోల్-డీజిల్!

దిల్లీలో కొత్త రూల్స్.. పాత వాహనాలకు జూలై 1 నుంచి 'NO' పెట్రోల్-డీజిల్!

Delhi Fuel Ban: ఇప్పటికే దేశరాజధాని నగరం దిల్లీని పొల్యూషన్, వాయు కాలుష్యం ప్రధానంగా పట్టిపీడిస్తోంది. ఇక్కడి కాలుష్యం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితులను అరికట్టేందుకు ఇప్పటికే దిల్లీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఊహించిన స్థాయిలో ఫలితాలను అందించలేకపోయాయి. 

ఈ క్రమంలోనే తాజాగా దిల్లీలో జూలై 1 నుండి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపటం నిలిపివేయాలని నిర్ణయించారు. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న కీలకమైన చర్యగా తెలుస్తోంది. దిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీని అమలు కోసం దిల్లీ నగరంలోని పెట్రోల్ పంప్‌ల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమెరాలు వాహనాల వయస్సు, రిజిస్ట్రేషన్ వివరాలను గుర్తించి, పాత వాహనాలకు ఇంధనం నింపకుండా నిరోధిస్తాయి. ఈ విధానం ద్వారా పాత వాహనాల వల్ల కలిగే హానికరమైన వాయు కాలుష్యాన్ని తగ్గించాలని దిల్లీ సర్కార్ నిర్ణయించింది. 

ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కేంద్రం మొదటగా దిల్లీకి మాత్రమే పరిమితం చేయనుంది. నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్, గౌతమ్ బుధ్ నగర్, సోనిపట్ వంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో కూడా ఈ నియమాలులోకి రానున్నాయి. 2026 ఏప్రిల్ నుండి మొత్తం NCR ప్రాంతం ఈ నియమాలకు అనుగుణంగా ఉండనుంది. 

ALSO READ | అన్ని ద్విచక్ర వాహనాల్లో ABS టెక్నాలజీ.. జనవరి నుంచి తప్పనిసరి.. ఎందుకంటే..?

తాజా చర్యలతో వాహన యజమానులు పాత వాహనాలను వదిలి, పర్యావరణానికి అనుకూలమైన కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా దిల్లీ నగరంలో వాయు కాలుష్యం తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయం వాయు నాణ్యత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.

దిల్లీ  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 100 ప్రత్యేక బృందాలను నియమాల అమలుకు కేటాయించింది. ఈ బృందాలు వాహన డేటాను పరిశీలిస్తూ, నియమాలను ఉల్లంఘించే పెట్రోల్ పంప్‌లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాయి. ఇందులో భాగంగా 90% పబ్లిక్ CNG బస్సులను డిసెంబర్ 2025 నాటికి ఎలక్ట్రిక్ బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు.