ఢిల్లీ:ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్కు కరోనా వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. అయితే, మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గకపోగా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాని తెలిపారు. దీంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని మరో ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితో సత్యేంద్ర జైన్ హాస్పిటల్లో చేరారు. కరోనా లక్షణాల కారణంగా బుధవారం ఆయనకు వైరస్ టెస్ట్ చేయగా మొదట నెగెటివ్ గా, ఆ తరువాత గురువారం మళ్లీ పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలింది.
సత్యేంద్ర జైన్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ‘కోవిడ్-19 తో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి శ్రీ సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని’ షా ట్వీట్ చేశారు.