
- మమ్మల్ని బట్టలూడదీసి కొడతామంటే.. మా తడాఖా చూపిస్తం
- కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ మిగలదని కామెంట్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు బట్టలూడదీసి కొడతామంటే, కాంగ్రెస్ కార్యకర్తలేం చేతులు ముడుచుకుని కూర్చోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ మిగలదన్నారు. ‘‘ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. దీన్ని మా చేతగానితనంగా భావించొద్దు.
మా బట్టలూడదీసి కొడతామంటే, మేం కూడా మా తడాఖా ఏంటో చూపిస్తాం” అని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవల్ కన్వీనర్ల శిక్షణా శిబిరంలో భట్టి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి, ప్రజాపాలన అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
దేశాన్ని మతం పేరు మీద మోదీ విడదీస్తున్నారు. విద్వేషాన్ని చిమ్ముతున్న బీజేపీకి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కాపాడేలా దేశవ్యాప్తంగా రాహుల్ న్యాయ్ యాత్ర చేస్తున్నారు. ఈ దేశాన్ని పాలించే అర్హత, శక్తి కాంగ్రెస్కు తప్ప మరే పార్టీలకు లేదు’’ అని అన్నారు. కాంగ్రెస్గెలుపును కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్లో గెలిచిన ఎమ్మెల్యేలమంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లమేనని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిస్తే కేటీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లు స్వేద పత్రం కాదు.. వాళ్ల ఆస్తుల పత్రం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉండి పూలే విగ్రహాన్ని బీఆర్ఎస్ సర్కార్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మొసలి కన్నీరు కారుస్తున్నారు. బీసీల మీద కవితకు నిజంగా ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా, అధ్యక్షుడిగా బీసీని నియమించాలి” అన్నారు.
17 స్థానాల్లోనూ గెలవాలి : దీపాదాస్ మున్షీ
మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ నేతలంతా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పిలుపునిచ్చారు. 17 స్థానాల్లోనూ పార్టీ గెలిచేలా కష్టపడి పని చేయాలన్నారు. ఎంతో కఠినమైన పనిని చేసి చూపించామని, ఇప్పుడు కూడా మరింత కఠినమైన పనే ఉంటుందన్నారు. ఒక్క అధికారిని పట్టుకుంటేనే వందల కోట్లు బయటపడుతున్నాయని.. అలాంటిది ఆ అధికారి బాస్లు అయిన కేటీఆర్, హరీశ్, కవిత ఇండ్లల్లో సోదాలు చేస్తే ఇంకెన్ని వేల కోట్లు బయటపడతాయోనని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ అన్నారు. పదేండ్లు కవిత ఎటు పోయారని, ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకున్నారని విమర్శించారు.