కొడాలి నాని కామెంట్కు కౌంటర్
అమరావతి, వెలుగు: సీఎం జగన్ చిటికేస్తే టీడీపీని వైసీపీ స్టోర్ రూంలో పడేస్తామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సీబీఐ చిటికేస్తే.. సీఎం జగన్ ఏ రూంలో దాక్కొoటారని ఎద్దేవా చేశారు. టీడీపీ కోసం ప్రాణాలైన ఇస్తామని, వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసులకు, బెదిరింపులకు లొంగేది లేదన్నారు. ఆదివారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
“టీడీపీని కూల్చేయడం ఎవరి తరమూ కాదు. అధికారం అండతో విర్రవీగుతున్న వైసీపీ నేతలు సీబీఐ విచారణ వేగవంతం చేస్తే సీఎం జగన్ ఎక్కడికి వెళ్తారో ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడు వైసీపీ బతుకు ఏమవుతుందో టీడీపీ నుంచి వెళ్తున్న వలస పక్షులు ఏమవుతాయో చూస్తాం. ఇసుక అక్రమాల్లో మునిగిపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలను దారిలో పెట్టి సీఎం జగన్ నిజాయతీ, పారదర్శకత గురించి మాట్లాడాలి. టీడీపీని విమర్శించే ముందు మొదట మీ ఇల్లు చక్కదిద్దుకోండి” అని జగన్ కు సూచించారు. తమకు అధికారం, ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదన్నారు. ఏపీలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి సీఎం జగన్ సిమెంట్ కంపెనీల నుంచి రూ. వెయ్యి కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. తెలుగు భాషను రక్షించుకోవాలని మాట్లాడితే జనం మీ ఇంటి కొచ్చి కొడతారంటూ జగన్ సీఎం స్థాయిలో ఉండి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.