స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తామవుతోంది. పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను డిజిపి అంజనీ కుమార్ పరిశీలించారు. వివిధ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ ఆగష్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత.. ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ఎల్ఈడీల ఏర్పాటు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వారికి సభాప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా.. కార్యక్రమాన్ని స్పష్టంగా చూసేందుకు 4 పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు. కార్యక్రమ లైవ్ కవరేజ్ కోసం 10 కెమెరా యూనిట్ లను, లైవ్ కవరేజ్ లింకింగ్ కు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.

సభాప్రాంగణంలో సర్వం సిద్ధం

సభకు వచ్చిన ముఖ్య అతిధులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డీజీపీకి వివరించారు. హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 1 లక్ష వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిళ్లు సిద్ధం చేశామని జలమండలి ఎండీ కిషోర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 ఆంబులెన్స్ లు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఓ గదిని సిద్ధంగా ఉంచామని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 3 ఫైర్ ఇంజన్లు 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని ఫైర్ శాఖ అధికారులు వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక జనరేటర్లు, వర్షం పడినా ఇబ్బందులు కలగకుండా వ్వాటర్ ప్రూఫ్ షెడ్ లను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు చెప్పారు. సీఎం కేసీఆర్ కి దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు. 

1930 వాహనాలకు పార్కింగ్ సదుపాయం

గోల్కొండ కోట పరిసర ప్రాంతాలలో పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1930 వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంల్ఏలు, ఎంపిలకు, మీడియా వాహనాలకు, సందర్శకులకు వేరు వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. జీహెచ్ ఎంసీ అధ్యర్యంలో శానిటేషన్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు.